Thursday, April 23, 2020

ఓ పిట్ట కథ (జానర్: సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ క్రైం డ్రామా)



ఓ పిట్ట కథ

(జానర్: సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ క్రైం డ్రామా)
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది ఈ సినిమా.
చివరి నిమిషం వరకు సస్పెన్స్ తో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో బాగా సాగిపొతుంది. చాలా నీట్ గా, ఆహ్లాదంగా వుంది. అందరూ చూడదగ్గ చిత్రం. గోదావరి అందాలు, అరకు లోయ అందాలు చక్కగా ఉపయోగించుకున్నారు.
ఫోటొగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ డిపార్ట్ మెంట్లు ఈ సినిమాకి అసలైన బలం.
కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా చూసి ఒక విధమైన తృప్తి తో బయటికి వచ్చాను. నిజానికి, స్క్రీన్ ప్లే పరంగా, నేటివిటీ పరంగా, అందులో కొన్ని అంశాలు పంటి క్రింద రాయిలా తగిలినా, ఎంత వద్దనుకున్నా కనిపించే మళయాళ వాసనలు వున్నప్పటికి బాగానే వుందబ్బ అనిపించింది అప్పట్లో.
ఈ ’ఓ పిట్ట కథ’ లో అలాంటి ఇబ్బందులు కూడా ఏమీ లేవు, హాయిగా ఒక చక్కని తెలుగు చిత్రాన్ని తెలుగు వాతావరణంలో బాగా తీశారు.
ఈ స్థాయిలో అలరించిన చిన్న బడ్జెట్ సినిమాలు ఇటీవల రాలేదు. చిన్న బడ్జెట్ చిత్రాలన్నీ విధిగా అసభ్యత, లేదా యూత్ సినిమా అని పేరు పెట్టుకుని హింస, బూతులతో నిండి చండాలంగా వుంటున్నాయి.
కానీ ఈ ’ఓ పిట్ట కథ’ దృశ్యం సినిమా అంతటి తృప్తిని ఇచ్చింది.
ప్రేక్షకుడికి కలిగే ప్రతి సందేహానికి చివర్లో సమాధానం దొరుకుతుంది.
’ఓ పిట్ట కథ’ సినిమాని ఎటువంటి అంచనాలు లేకుండా చూశాను నిన్న సాయంత్రం.
అమెజాన్ ప్రైమ్‍లొ విడుదల అయింది.
ఈ సినిమా విడుదల తేది మార్చి ఆరు. బహుశా కరొనా దెబ్బకి విడుదల అయిన పదే పది రోజుల్లోపలే అమెజాన్ లో ప్రత్యక్ష్యం అయింది. పాపం అనిపించింది.
బ్రహ్మాజి తప్ప ఇందులో మనకు తెలిసిన నటీ నటులు ఒక్కరూ లేరు.
బాల నటిగా ’దేవుళ్ళు’ చిత్రంలో నటించిన నిత్యా షెట్టి హీరోయిన్ గా నటించటం ఒక విశేషం. ఈ అమ్మాయి చాలా చక్కగా చలాకీగా, చిలిపిగా పాత్రోచితమైన అమాయకత్వం తో చాలా అహ్లాదంగా కనిపించింది.
ఈ అమ్మాయి ప్రేమికులుగా నటించిన సంజయ్ కుమార్, విశ్వంత్ చాలా అనుభవమున్న నటులలాగా నటించారు. బ్రహ్మాజి పుత్రుడు సంజయ్ కుమార్ కి ఇది మొదటి చిత్రమే అయినా చాలా ఈజ్ తో నటించాడు.
కథ:
హీరోయిన్ వెంకట లక్ష్మి చిన్నతనం లోనే తల్లిని కోల్పోవడంతో, తల్లి తండ్రి అన్నీ అయి వాళ్ళ నాన్నగారు బాగా చూసుకుంటూ వుంటారు. వీళ్ళు ఒక చిన్న ఊర్లో వుంటారు. వీళ్ళ జీవనాధారం వాళ్ళ స్వంత సినిమా థియేటర్. అందులో అసభ్య చిత్రాలు ఆడిస్తూ ఏదో ఆ పూటకి ఆ పూటకి అన్నట్టు జీవితం వెళ్ళదీస్తూ వుంటాడు ఆమె తండ్రి. పైగా ఆయనకు ఊరంతా అప్పులు పేకాట వ్యసనం కారణంగా .
ఈ అమ్మాయి మేనత్త చిన్నప్పుడే ఇంట్లో వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని విదేశాల్లో స్థిర పడి వుంటుంది.
ఈ నేపథ్ద్యంలో ఆ మేనత్త కొడుకు ఊడిపడతాడు. మొదటిచూపులోనె మరదలితో ప్రేమలో పడతాడు.
ఈ అమ్మాయి అప్పటికే తన బాల్య మిత్రుడు, తమ సినిమా హాల్లో పని చేసే కుర్రాడితో (సంజయ్ ) ప్రేమలో వుంటుంది.
ఈ ముగ్గురి మధ్య కథ అనేక మలుపులు తిరిగుతుంది.
అరకులోయలొ వెంకటలక్ష్మి అనుమానాస్పద స్థితిలో అరకు లోయలో అదృశ్యం అవటం తో కథ అసలు మలుపు తిరుగుతుంది. ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఆమెని వెనుకపాటుగా ఓ ముసుగు మనిషి వచ్చి దాడి చేసే దృశ్యం తో కథ ప్రారంభ మవుతుంది. అక్కడి నుంచి ప్రతి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మనకు కథ చెబుతుంది.
సస్పెన్స్, క్రైం, ధనాశ, మోసం,హత్య, పోలీసు స్టేషన్ ఇలా సాగిపోతుంది. కథ.
స్క్రీన్ ప్లే మరియు ఇతర సాంకేతిక అంశాలు:
ఏ పాత్రకా పాత్ర పోలీసు స్టేషన్ లో ఎస్సై గారికి జరిగిన కథ చెప్పటం ద్వారా ప్రేక్షకులకు కథ మీద పట్టు దొరుకుతుంది. చివరికి ఏమవుతుంది అన్నది ప్రేక్షకుడికి సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
ఏ పాత్రకి ఆ పాత్రే నిజమే కదా చెబుతోంది అని అనిపిస్తుందు ప్రేక్షకుడికి. ప్రతి పాత్ర పట్ల సానుభూతి కలుగుతుంది, కోపం వస్తుంది. తక్కువ డెప్త్ వున్న కథ అయినప్పటికీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే వ్రాసుకుని, మంచి ఫోటోగ్రఫీ, ఏడిటింగ్, చక్కటి సంగీతంతో ఈ సినిమా చాలా రోజుల పాటు గుర్తు వుంటుంది ప్రేక్షకులకు.
ఇటీవలి కాలం లో సాంకేతికత మీద ఎక్కువ ఆధార పడి సామాన్య ప్రేక్షకుడికి గందరగోళం కలిగించిన చిత్రాలు చాలానే వచ్చాయి, మత్తు వదలరా మొదలైనవి.
కానీ ఇందులో స్క్రీన్ ప్లే నిజమైన హీరో. హోమ్ వర్క్ బాగా చేశారు స్క్రీన్ ప్లేమీద అని అర్థం అవుతుంది.
దర్శకుడు చందు ముద్దుకు మంచి భవిష్యత్తు వుంది.
ఇది అందరూ చూసి ఆనందించదగ్గ సినిమా.
ఒక మంచి ప్రయత్నం

No comments:

Post a Comment