Sunday, April 26, 2020

"నువ్వూ ఇంతేనా లాజా!" (ఒక ఙ్ఞాపకం 2)


ఒక ఙ్ఞాపకం 2
"నువ్వూ ఇంతేనా లాజా!"
--------
"పిన్నమ్మా! నా వల్ల ఒక పొరపాటు జరిగింది. నేను చిన్న పిల్లాడి నమ్మకాన్ని వమ్ము చేశాను. ఇకపై వాడు  ఎన్నడూ నన్ను నమ్మడు పిన్నమ్మా" అంటూ ఏడుస్తూ వుండిపోయాడు నాగరాజ శాస్త్రి.

అసలేం జరిగిందంటే, .....
******

అవి నేను అనంతపురంలో ఆరవ తరగతి చదువుకుంటున్న రోజులు. విద్యారణ్యా హైస్కూల్లొ చదువుకుంటూ వుండే వాడిని. అఫ్‍కోర్స్, ఈ కథకి నా స్కూలుకి సంబంధం లేదు అనుకోండి. ఆ ఉర్లో వుండినది ఒకే ఒక సంవత్సరం. తరువాత ఏడవ తరగతి జమ్మలమడుగులో చదివాను. ఆ కథలు తర్వాత.

ఈ కథలో అసలు హీరో వల్లీనాథ శాస్త్రి. పెరు విని ఎదో చాలా పెద్ద వాడనుకునేరు. అప్పటికి వాడి వయసు మహా అంటె నాలుగు లేదా ఆయిదు సంవత్సరాలు అంతే.  మనం ఇతన్ని ముద్దుగా వల్లీ అని పిలుచుకుందాం.

మా అప్పకి తన కెరియర్ లోనే మొదటి అతిపెద్ద ప్రమోషన్ అనంతపురం ఆర్.డీ.ఓ గా వచ్చిన రోజులవి. కర్నూల్లో డిప్యూటి కలెక్టర్ గా చేసిన తర్వాత మా అప్పకి ప్రమోషన్ మీద అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయిన సందర్భం అది.

అప్పుడే వల్లీని చూడటం తటస్తించింది.  ఎవరయ్య ఈ వల్లీ అని కదా మీ సందేహం? అదిగో అక్కడికే వస్తున్నా. మా పెద్దమ్మ వాళ్ళ ఎకైక మనవడే ఈ వల్లీ నాథ శాస్త్రి అదేనండీ మన వల్లీ అన్న మాట.
బొద్దు బొద్దుగా, తెల్లటి తెలుపుతో, ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకర్షించి అందరికీ వినోదం పంచే వాడు మా వల్లీ.
వాడి గురించి కబుర్లు చెప్పాలంటే బోలెడున్నాయి.
మా పెద్దక్కయ్య పెళ్ళి జరిగింది ఆ రోజుల్లోనే. వజ్రకరూరు అనే ఊరికి చెందిన శ్రీ.భాస్కర లక్శ్మీనరసింహమూర్తి గారికి ఇచ్చిచేయటం జరిగింది. ఆ పెళ్ళి ముచ్చట్లు చాలా సరదాగా ఉంటాయి అవన్నీ మరోసారి.
పెన్న అహోబిలం, ఊరవకొండ దాటుకుని వెళ్ళాలి వజ్రకరూరు కు. అన్నట్టు వజ్రకరూరులో వజ్రాలు నిజంగానే దొరుకుతాయట. మాకు మాత్రం మా బావగారి రూపంలో దొరికినట్టయింది. అయన నుంచి ప్రస్తుతతరం యూత్ ఎంతయినా నేర్చుకోవాలి. అవన్నీ ఇంకోసారి.
సరే ఈ వజ్రకరూర్ ముచ్చట ఎందుకంటే, ఆ ఉరికి మా వాళ్ళు కొన్ని సార్లు కార్లలోనూ, కొన్ని సార్లు బస్సులలోను వెళ్ళాల్సి వచ్చింది, ఈ పెళ్ళి పనుల కారణంగా. ఆ ట్రిప్పుల్లొ భాగంగా మా అన్నయ్య శ్రీ అప్పాజీ గారు ఒక సారి వల్లీని తీసుకుని బస్సులో వజ్రకరూర్ వెళుతూ వుంటే, ఆయన మాటలమధ్య ’వల్లీ,వల్లీ’ అంటుండటం చూసి కొందరు సాయిబులు, మీరెవరు ఎందుకు మా సాయిబుల పిల్లోడిని తీసుకుని వెళుతున్నారు అని నిలేశారట. ’అయ్య మేము పదహారణాల తెలుగు వాళ్ళం, మీరనుకుంటున్నట్టు వీడు ’వలీ’ కాదు, వల్లెలంబాదేవి వరప్రసాదంగా జన్మించటం వల్ల వీళ్ళ తలితండ్రులు వీడికి వల్లీనాథ శాస్త్రీ అని పేరు పెట్టుకున్నారు. మేము ’వల్లీ’ అని ముద్దుగా పిలుచుకుంటాము" అని చెప్పటంతో వారు శాంతించారట.
"ఆకాశంలో చుక్కలు లేవు" అన్న పాట ఫేమస్ అప్పట్లో. అది పాడటంలో వాడు "ఆకాశంలో కుక్కలు లేవు" అని పాడే వాడు నోరు తిరగక. మా అప్ప వాడితొ ఆ పాట అడిగడిగి పాడించుకునే వారు.

అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన మాకు  అక్కడ దొరికిన బాడుగ (అద్దె) ఇంటికి   దగ్గరలొనే యాదృచ్చికంగా మూడో ఇంట్లో మా పెద్దమ్మా వాళ్ళు వుండేవారు. పెద్దమ్మ అంటే స్వయానా మా అమ్మగారికి అక్కయ్య.  మా పెద్దమ్మ పేరు శ్రీమతి రామలక్షమ్మ.  ఈమె మా అమ్మ గారికి పెద్ద అక్కయ్య. మా అమ్మ గారి ఆనందానికి అవధులు లేకపోయింది. మా అమ్మ గారికి రెండో అక్కయ్య గారు హొస్పేటలో వుండేవారు. ఆ ముచ్చట్లు ఇంకో సారి.

మా రామలక్షమ్మ పెద్దమ్మ గారి భర్త అంటే మా పెదనాన్న గారి పేరు శ్రీ గొల్లాపిన్ని వాసుదేవ శాస్త్రి గారు; ఆయన సంస్కృతాంధ్రాగ్ల భాషలలో తలపండిన పండితులు. అంతే కాక ఆయన క్వాలిపైడ్ ఆయుర్వెద వైద్య శిఖామణి. ఆయనని కలిసినప్పుడల్లా ’ఓమ్ శ్రీ మాత్రే నమహ’ అని అంటూ వుండేవారు.  ఆయన ఇంటి బయట కూడా వారి నేమ్ ప్లేట్‍పై ’ఓమ్ శ్రీ మాత్రే నమహ’ అని వ్రాసుండేది.  ఆయన డాక్టర్ కద మాత్రలకు నమస్కారం అని చెప్పి మాట్లాడేవారేమోనని అనుకునే వాడిని చిన్నతనంలో. కానీ కాదని అది మాతృవందనం అని ఇంట్లో వాళ్ళు తర్వాత చెప్పారు. మా పెద్దనాన్న గారు ఇంకో రకంగా కూడా మాకు చుట్టం, అదేలాగంటె, మా అమ్మగారికి ఆయన పెద్ద మేనమామ. ఆయన్ విద్వత్తు విషయంలో కాశీపండితుల నుంచి సైతం మన్ననలు అందుకున్న పెద్ద పండితోత్తములు. ఆయనకు  జీవితంలో ఎందుకో తెలియదు గానీ, రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడేవారనిపించేది. కానీ ఆయనకు విపరీతమైన ఆత్మాభిమానం. ఎందరో రాజకీయనాయకులు, అధికారులు ఆయన దర్శనార్థం వచ్చేవారు, ఎవ్వరి ముందు ఆయన చేయి సాచింది లేదు. ఆయనకు అయిదుగురు మొగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు.
మా పెదనాన్న గారి రెండవ అబ్బాయే శేషశాస్త్రి. ఈ శేషశాస్త్రి గారి పుత్రుడే వల్లీ.
మా పెదనాన్న గారికి అంత విస్తృతమైన సర్కిల్ వున్నా, అపరిమితమైన పాండిత్యంవున్నాతన వ్యక్తిగత పనులకు గాని, తన పిల్లల ఉద్యొగ సంబంధిత సిఫార్సులకు గానీ ఆయన ఎవర్నీ అర్థించింది లేదు. నాకు అప్పుడు పిల్లతనం వల్ల తెలియదు గానీ, ఇప్పుడనిపిస్తుంది, మా పెదనాన్న కాస్తా లౌక్యంగా వ్యవహారించివుంటే ఆయన జీవితం ఇంకో లాగా వుండుండేది అని. ఇక మా నాన్న గారి విషయానికి వస్తే ఆయనా అంతే. అవన్నీ ఇంకో సందర్భంలో చెప్పుకుందాం.

మన వల్లీ తండ్రి గారు శేషశాస్త్రి గారు, మలేరియా డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ గా పని చేసే వారు. ఆయన దారుణమైన నక్సలైట్ భావజాలం కలిగిన వారు.
ప్రతి రోజూ మా ఇంటికి వచ్చి చాలా చక్కటి స్వరంతో విప్లవ గీతాలు పాడివినిపించే వాడు.
"ఎర్ర జెండెర్రజెండెన్నియల్లో... ఎర్రెర్రనీదీ జండేన్నియల్లో..."
"బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి.."
"శీకాకుళము పై చీమకొండకూ, ఎమి పిల్లో ఎళదము వస్తావా..?"
ఇలాంటి సాహిత్యమంతా అప్పుడే నేను మొదటి సారిగా వినింది. ఒక విధమైన ఉద్రేకం వచ్చేది.
రంగనాయకమ్మ వ్రాసిన రామాయణ విషవృక్షం గురించి పొగట్టం, రంగనాయకమ్మ తదితర నాస్తిక సభలకు మా కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళటం, చారు మజుందార్, నక్జల్బరీ ఉద్యమం గురించి తరచు చర్చించటం బాగా మోపయ్యింది ఆ రోజుల్లో.
ఆ తర్వాత ఓ ఇరవై ఏళ్ళ పాటు నామీద ఆ ప్రభావం ఉండిపోయింది. ఒక అర్థం లేని ఆవేశం, ప్రతీ దాన్ని వ్యతిరేకించటం ఇలా సాగిపొయింది. ఈ మూలాల కారణంగానే నేను నా పదిహేనో ఏటే సీ.పీ,యం వారితో విపరీతంగా తిరిగే వాడిని. మాదాల రంగారావు సినిమాలు విపరీతంగా చూసే వాడిని. గద్దర్ అంటే ఒక దైవ సమానంగా భావించే వాడిని.
చాల సంవత్సరాల పాటు దేవుళ్ళని నమ్మకపొయే వాడిని, అవధూతలని , దైవదూతలని తూలనాడేవాడిని. సాయుధ విప్లవం ఎప్పుడొస్తుందా, మాదాల రంగారావు సినిమాలలో క్లైమాక్స్ సీన్ లాగా జనాలందరూ కర్రలు, చాటలు ఇలా ఏవి చిక్కితే అవిపట్టుకుని శ్రీశ్రీ గారి పాటలు పాడుకుంటూ (వీలయితే చక్రవర్తి సంగీతం సమకూరుస్తారు బాక్ గ్రౌండ్లో )అని విశ్వసిస్తూ చాలా సంవత్సరాలు అమాయకంగా ఎదురు చూశానంటే నమ్ముతారా?
ఆ రోజుల్లో ఎవరయినా  సనాతన ధర్మానికి సంబంధించిన మంచి విషయాల్ని చక్కగా చాగంటి కోటేశ్వర రావు గారిలా చెప్పే గురువు దొరికి వుంటే నా జీవితం వేరేలాగా వుండేది. నేను నా జీవితంలో ఏదయినా రిగ్రెట్ అయ్యే అంశం వుందా అంటే ఇది ఒకటి. ఇలా చాలా వున్నాయి. సందర్బం వచ్చినప్పుడు చెప్పుకుందాం.
మా అప్ప ఒక్కటే చెప్పే వారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు, మన రుషులు, సనాతన ధర్మ సారధులు అందరి లక్ష్యం ఒక్కటే. పేదలనే వారుండకూడదు. అందరూ ఆనందంగా వుండాలి. లక్ష్యమ్ ఒక్కటే గానీ మార్గాలు వెరు. కాని చివరికి అందరూ ఎంచుకోవాల్సిన మార్గం సనాతన ధర్మమే, గుడిపాటి వేంకట చలం జీవితమే ఇందుకు ఉదాహరణ అని చెప్పి, చర్చలలో ఎక్కువ పాల్గొనకుండా హుందాగా వెళ్ళిపోయే వారు.
కార్ల్ మార్క్స్ అయినా, శంకరాచార్యుల వారయినా, గౌతమ బుద్దుడయినా అందరూ కోరుకునేది సమాజ హితాన్నే. అందరూ వాంచించేది సర్వమానవ సౌబ్రాతృత్వమే. ఈ కమ్యునిజమనేది ఆవేశంలో వున్నవారికి తాత్కాలికంగా మంచిగా అనిపించవచ్చు కాని, శాస్వతమైన సత్యాలన్ని సనాతనధర్మంలోనే వున్నాయి అని చెప్పి తప్పుకొనేవారు తప్పనిచ్చి ఎప్పుడు వాదనకు దిగింది లేదు.
నేను ఏ మార్గంలో పయనించినా మా అప్ప అభ్యంతరపెట్టే వారు కాదు. ఎలాంటి స్నేహితులని ఎంచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని వాచా ఆయన ఏనాడు చెప్పలేదు. అన్నీ తెలుసుకుని, మన జీవితాన్ని మనం మలచుకోవాలన్నది వారి ఫిలాసఫీ అనుకుంటా. దీని వల్ల రచయితగా నేను ఎదగటానికి దోహదం అయింది.
ఇంప్రెషనబుల్ ఏజ్డ్ పిల్లల పట్ల వారి స్నేహితుల పట్ల తలితండ్రులు జాగురుకత వహించాలి అనే భావం నాకు ఈ సంఘటనల వల్ల ఏర్పడింది. కాని అది కూడా తప్పే. ఎవరూ కూడా కర్మచక్రానికి అతీతులు కాదు అని ఇటివల అభిప్రాయ పడుతున్నాను.
చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీ శేషశాస్త్రి కూడా తన తదుపరి జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం జరిగింది. ఆయన మనసు చాలా మంచిది. నా ఇరవైయ్యవ ఏట  ఒక సందర్భంలో తుంగభద్రా డ్యాం (ఇది ఊరిపేరు) లో వారింట్లో ఒక పది రోజులు ఆయన దగ్గరే వుండి ఆయనని దగ్గర నుంచి చూడటం జరిగింది. ఆయనొక విఙ్యాన ఖని.
సరె వల్లీ విషయానికి వద్దాం.
ఒక రోజు ఉదయాన్నే వల్లీ వాళ్ళ చిన్నాయన నాగరాజ శాస్త్రి  వచ్చాడు మా ఇంటికీ. రావటం రావటమే కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ వుండిపోయాడు. మా అమ్మ దగ్గర బాగా చనువు.
"పిన్నమ్మా! నా వల్ల ఒక పొరపాటు జరిగింది. నేను చిన్న పిల్లాడి నమ్మకాని వమ్ము చేశాను. ఇకపై వాడు నన్ను ఎన్నడూ నమ్మడు పిన్నమ్మా" అంటూ ఏడుస్తూ వుండిపోయాడు నాగరాజ శాస్త్రి.
అసలేం జరిగిందో చూద్దాం.
వల్లీని స్కూల్లో చేర్పించిన కొత్తలు అవి. సహజంగానే అందరు పిల్లల లాగా వల్లీ కూడా స్కూలుకు వెళ్ళను అని మొండికేశే వాడు. వాళ్ళ నాన్న సహజంగానే ఇలా బలవంతంగా స్కూలుకు పిల్లల్ని పంపటానికి వ్యతిరేకి, అందునా ఆయన పార్టీ పనులతోనూ, ఆఫీసు పనులతో బిజీగా వుండటం వల్ల, వల్లీని స్కూలుకు దింపి రావాల్సిన బాధ్యత వల్లీ అత్తయ్యగార్లపైనా, మిగతా బాబాయిల పైనా పడేది.
వాళ్ళు పిల్లవాడిని బలవంతంగా స్కూలుకు దింపి వచ్చే వారు, పిల్లవాడు ఏడ్చినా అది వాడి మంచికోసమే కదా అన్న కన్విక్షన్ వుండటం వల్ల వారు విధిగా ఆ బాధ్యత నిర్వర్తించే వారు.
ఆ రోజు ఆ బాధ్యత రాజా అని పిలవబడే నాగరాజ శాస్త్రి పై పడింది.
ఈయన సహజంగానే  ’కవి హృదయం’ కలవాడు. సున్నిత మనస్కుడు. పిల్లవాడ్ని ఏడిపించకూడదు అన్న సిద్ధాంతాన్ని విశ్వసించి, "స్కూలుకు కాదు వల్లీ మనం సరదాగా అలా వెళ్ళొద్దాం" అని చెప్పి వేరే దారిలో తీసుకువెళ్ళి ఆ వీధీ, ఈ వీధి తిప్పి చివరకు స్కూలు ముందుకే తీసుకెళ్ళి దింపాడట. సరదాగా అలా తిప్పటం వల్ల పిల్లవాడిలో మార్పు వచ్చి స్కూలుకు ఆనందంగా వెళతాడని ఈయన్ అంచనా.
కానీ ఈయన అంచనాల్ని తలక్రిందులు చేస్తూ వల్లీనాధుడు యధాప్రకారం ఏడుపులంకించుకున్నాడట.
కళ్ళనిండా నీళ్ళతో, వెక్కిళ్ళుపెట్టి ఏడుస్తూ కుడిచేతి చూపుడు వేలిని సూటిగా రాజావైపుకి సంధించి "నీవూ ఇంతేనా లాజా" అన్నాడట వల్లీనాధుడు. అప్పట్లో వాడికి ’ర’ పలికేదు కాదు బహుశా.
"యూ టూ బ్రూటస్" అని కళ్ళ నిండా ఆశ్చర్యం నింపుకున్న సీజర్ చక్రవర్తిలా వల్లీ అలా అడిగేసరికి, రాజా గారికి హృదయం ద్రవించింది.
నేరుగా మా ఇంటికి వచ్చి ఏడ్చేశాడు. ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపేశాడు, అన్నం కూడా సహించలేదాయనకు ఆ రోజు. తిరిగి వల్లీ స్కూలు నుంచి వచ్చే వరకు అన్యమనస్కంగానే గడిపి, సాయంత్రం వాడు రాగానే ముద్దులాడేవరకు ఆయనకు మనస్సు నెమ్మదించలేదు.
అప్పట్నుంచి మాఇంట్లో ’యూ టూ బ్రూటస్’ అనాల్సిన ప్రతి సందర్భంలో "నీవూ ఇంతేనా లాజా" అన్న మాట వాడుకలో స్థిరపడిపోయింది.
***
ఇప్పుడు ఆ వల్లీనాధ శాస్త్రి చాలా మంచి పొజిషన్ లో స్థిరపడి, ఇటివలే స్వంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి ఆహ్వానిస్తే వెళ్ళినప్పుడు ఈ ముచ్చట్లు చెప్పుకుని మనసారా నవ్వుకున్నాం.

No comments:

Post a Comment