Sunday, April 26, 2020

"బాంబులతో అనుభవాలు" (ఒక జ్ఞాపకం-11)





"బాంబులతో అనుభవాలు"
(ఒక జ్ఞాపకం-11)
రాయలసీమతో ప్రత్యక్ష సంబంధాలున్నప్పటికీ నాకు ఫాక్షనిస్టులవల్ల గానీ, బాంబులతో గానీ ఏనాడు ఇబ్బందికరమైన పరిస్థీతులు ఎదురు కాలేదు.
కడప బాంబులు అని వినటమే గానీ చూసింది లేదు. ఆళ్ళగడ్డ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పులివెందుల, యర్రగుంట్ల, జమ్మలమడుగు, కడప,కర్నూలు, అనంతపురం ఈ ఊళ్ళన్నిట్లో స్కూలు చదువులు చదువుకున్నాను, స్నేహితులతో తిరిగాను, ఉద్యోగరిత్యా అనేకమందితో కలిసి పనిచేశాను. కానీ రాయలసీమలో ఎక్కడా నాకు బాంబులు ఎదురుకాలేదు.

కానీ నేను బాంబు పేలుళ్ళను ప్రత్యక్షంగా చూడాల్సిచ్చింది. ఒక సారి కాదు దాదాపు మూడు సార్లు. అవెలా జరిగాయో చెపుతాను.

బాంబు పేలుళ్ళుకు కేవలం వంద అడుగుల దూరంలో నేను వుండవలసి వస్తుందని నేను కలలో సైతం అనుకోలేదు.
కోయంబత్తూరు కు ప్రమోషన్ పై వెళ్ళిన కొత్తలు. తమిళ భాష సరిగ్గా రాదు. నగరం తాలుకు టొపోగ్రఫీ పూర్తిగా తెలియదు. కొత్తగా వచ్చిన ప్రమోషన్, కొత్త ఊరు, కొత్త భాష, కొత్త పరిచయాలు. తెలిసిన ఒకే ఒక మిత్రుడు నవీన్ కుంబ్లే.
అంతకు ముందు నుంచే పరిచయము ఉన్న ఆ పెన్ ఫ్రెండ్ ఫామిలీ తో కంపెనీ బాగా వుండేది. (అప్పటికి ఫేస్ బుక్కు, వాట్సాప్ వుండేవి కావు కద. అప్పట్లో పెన్ ఫ్రెండ్షిప్ అని ఒక సంస్కృతి అమల్లొ వుండేది లెండి. ఓ సారి ఏదో జాబ్ ఇంటర్వ్యూలో పరిచయం అయిన నవీన్ తో అలా నా స్నేహంకొనసాగింది.)
ఆ ఫ్రెండ్ పెరు నవీన్ కుంబ్లే. క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇంకా పాపులర్ కాని రోజులనుంచీ నాకు పరిచయం ఆ అబ్బాయి. మంగళూర్ కు చెందిన కోంకణీ బ్రాహ్మణ కుటుంబం వారిది. నవీన్ కుంబ్లే ఒక్కడే కుర్రాడు వాళ్ళ నాన్న గారికి. ఆయనపేరు జనార్దన్ కుంబ్లే., ఆయన ఎల్ ఐ సీ లో పని చేసే వారు, వాళ్ళ అమ్మ గారు ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో హిందీ టీచర్.
కుంబ్లే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో వుంటూ చిన్నచిన్న జాబ్స్ చేసుకుంటూ వుండేవాడు. అప్పటికి ఆ కుర్రాడికి ఇంకా పెళ్ళి కాలేదు.
కుంబ్లేల కుటుంబం నన్నూ,నా శ్రీమతిని బాగా ఆదరించే వారు. వారు అక్కడి స్థానికులు అవటాన మాకు గైడెన్స్ ఇచ్చేవారు అన్నిటా.
1998 ఫిబ్రవరి 14 కోయంబత్తూరు. (ఓ భయంకరమైన రోజు)
కంపెనీ పనిపైన గాంధీనగర్ లో రాజరాజేశ్వరీ టవర్స్ వెనుకున వున్న ఓ లాయర్ గారి వద్దకు వెళ్ళాము నేను, నవీన్ కుంబ్లే.
అప్పటికి సమయం మధ్యాహ్నాం రెండున్నరయ్యుంటుంది.
లాయర్ గారు నవీన్ క్లాస్ మేటే. లాయర్ గారు మాకు కావాల్సిన సలహాలు ఇచ్చి, ఆఫీస్ గదికి ఆనుకునే వున్న విశాలమైన రాజసౌధం లాంటి ఇంట్లోకి ఆహ్వానించారు.. చాలా సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఆ లాయర్ గారిది. చక్కటి ఫిల్టర్ కాఫీ, మురుకులు ఇచ్చి ఆదరంగా మాట్లాడుతూ వుండిపోయారు.
ఆ లాయర్ గారు ఇచ్చిన సలహాలని చెన్నైలోని మా రీజినల్ మేనేజర్ గారికి ఎస్.టీ.డీ ఫోన్ చేసి చెప్పాలి. అందుకే ఇక శెలవు తీసుకోవాల్సొచ్చింది. చూస్తుండగానే ఓ గంట నిమిషంలా గడిచిపోయింది వారి ఇంట్లో.
మెయిన్ బస్టాండ్ పక్కనున్న రాజ రాజేశ్వరీ టవర్స్ వద్ద ఎస్.టీ.డీ బూత్ నుంచి ఫోన్ చేస్తే ఓ పని అయిపోతుంది అని బయలుదేరాం. కైనేటిక్ హోండా స్టార్ట్ చేసుకుని బస్టాండ్ దాటి ముందుకెళుతున్నాం.
అప్పుడు జరిగింది ఆ సంఘటన.
ఇంచుమించు బస్టాండ్ దాటి మలుపు తిరుగుతున్నాం. సరిగ్గా ఓ వంద అడుగులు వెళితే చాలు రాజరాజేశ్వరీ టవర్స్ అని పిలవబడే షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది.
అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలా అయిదు నిమిషాలు.
ఏదయితే షాపింగ్ కాంప్లెక్స్ కి మేం చేరుకోవాలో అది మా కండ్లముందరే కనిపిస్తోంది. మా చెవులు బైర్లు కమ్మేలా, కళ్ళు మిరిమిట్లు గొలిపేలా పెద్ద పేలుళ్ళు రెండు జరిగాయి మాకు సరిగ్గా వంద అడుగుల దూరంలో.
ఊహించని ఆ పరిణామానికి సడెన్ బ్రేక్ వేయటంతో అదుపు తప్పిన స్కూటర్ పైనుంచి నేను, నవీన్ ఇంచుమించు క్రింద పడినంత పనయ్యింది.
కొంచెం తేరుకుని చూస్తే అర్థం అయ్యింది, రాజరాజేశ్వరీ టవర్స్ తాలూకూ సెల్లార్ పార్కింగ్ లో ఏదో పేలుడు జరిగిందని. బహుశా ట్రాన్స్‌ఫార్మర్ పేలిందేమోననుకున్నాం మొదట.
ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ అయోమయాన్ని కలిగించేవే.
భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారానికి వచ్చిన శ్రీ ఎల్.కే.అద్వానీ గారిని అంతమొందించే ప్రయత్నంలో నగరమంతటా సీరియల్ బాంబులు పెట్టారని క్రమంగా తెలిసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో పన్నెండు బాంబులు పేలాయి వివిధ స్థలాల్లో. ఇంకా పేలకుండా మిగిలిపోయిన డజన్ల కొద్ది బాంబుల్ని పోలీసులు తరువాత నిర్వీర్యం చేశారు. ఈ పేలుళ్ళలో దాదాపు రెండు వందలమంది చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు, కొద్ది మంది అదృష్టవంతులు ప్రాణాలతో బట్టకట్టగలిగారు. వాళ్ళలో నేను ఒకడిని.
నేను బాంబు పేలుడుకి ఇంత దగ్గర్లో ఉండినానని మా ఇంట్లో వారికి ఇప్పటికీ తెలియదు.

ఆ సమయంలో మా శ్రీమతి పరిమళ లత కడపలో ఉన్న మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వుండింది. ఇంట్లో నేను ఒక్కడినే. దాదాపు వారం రోజులు కర్ఫ్యూ పెట్టారు. నేను ఓ రెండ్రోజులు చూసి రైలెక్కి కడపకెళ్ళిపోయాను. కానీ ఆ రెండు రోజులు కుంబ్లే కుటుంబం నన్ను స్వంత బిడ్డలాగా చూసుకున్నారు.
ఒక అందమైన ఊరు, శాంతికి నిలయమైన నగరం, చల్లటి వాతావరణానికి పెట్టింది పేరు , రిటైర్‍అయిన వారికి స్వర్గం అన్న పెరున్న ఓ నగరం కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఓ స్మశానంగా మారిపోయింది. కారణం ముమ్మాటికీ ఇస్లాం టెర్రరిస్టులే.
ఆ పేలుళ్ళు ఆ నగర ముఖ చిత్రాన్నే కొన్ని సంవత్సరాల పాటు మార్చేశాయి. వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. పరస్పర నమ్మకాలు దెబ్బతిన్నాయి. స్వేచ్చగా తిరిగే వాతావరణం దెబ్బ తింది. ఆ తర్వాత దాదాపు ఓ రెండేళ్ళ పాటు ప్రతి కూడలిలో పోలిసు అవుట్‍పోస్టులు, చెక్కింగ్ లు.
ఏది ఏమయినా నవీన్ కుంబ్లే కుటుంబానికి మరొక్కసారి ఈ ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా థాంక్స్.
Coimbatore Bomb Blasts

No comments:

Post a Comment