Friday, July 8, 2022

"రహదారులు నాగరికతకి చిహ్నాలు"

 "రహదారులు నాగరికతకి చిహ్నాలు"

-డా.రాయపెద్ది వివేకానంద్


"రహదారులు నాగరికతకి చిహ్నాలు" రహదారుల పక్కన ఈ బోర్డ్ మీరు గమనించే ఉంటారు.

ఇప్పటి మన జాతీయరహదారుల స్థాయిని బట్టి చూస్తే మనంత అనాగరికులు ఎవరూ ఉండరేమో.

****

హైవే పై మనం వెళ్తుండగా, దూరంగా వరుసగా వాహనాల బారు కనపడి, ఆ వరుసలో మన వాహనం చివర్లో ఆగవలసి వస్తే,

"ఏదో ఆక్సిడెంట్ అయి ఉంటుంది" అని భీతి మనల్ని నిలువెల్లా ఆవరిస్తుంది.

ఆక్సిడెంట్ అయిన దృశ్యం కనపడుతున్నప్పుడు, ఆ పక్కగా మనం వాహనంలో వెళుతున్నప్పుడు, కలిగే బాధ, వేదన కొన్ని గంటలు మనల్ని వదలదు.

నిర్జీవంగా పడి ఉన్న దేహాలు

గాయాలై రోదిస్తున్న బాధితులు

అయోమయంలో దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న చిన్నారులు

చెల్లా చెదురుగా పడి ఉన్న వాహనాల తాలూకు శకలాలు

పగిలి ముక్కలైన అద్దం ముక్కలు

దూరం వరకు చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర అవయవాలు

’కుయ్..కుయ్...కుయ్’ మని కూత పెడుతూ వచ్చి నిలుచున్న ఆంబులెన్స్ లు

ఈ దృశ్యాలు కొన్ని రోజుల వరకు మన స్మృతి పథం నుంచి దూరం అవవు.

****

ఎక్కడైనా ప్రమాదం జరిగింది అంటే కారణం ఒక్కటే ఒక్కటి.

 

" నిర్లక్షం"

 

==> రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం

==> వాహనం నడపటంలో నిర్లక్ష్యం

==> వాహనం తయారీలో నిర్లక్ష్యం

==> వాహన నిర్వాహణలో నిర్లక్ష్యం

 

ఇంతకు మించి వేరే ఏ కారణం నాకు కనిపించదు.

 

*****

అదేదో సినిమాలో చిరంజీవి చెప్పారు గుర్తుంది కద, "ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం థాంక్స్" అన్నట్టు హైవేల పక్కన  నాకు నచ్చని ఒకే ఒక బోర్డ్ "ప్రమాదములు జరుగు స్థలము".

ఎన్నో బోర్డులు ఉంటాయి హైవే పై

***

’ఫలానా జిల్లాకి స్వాగతం’

’టోల్ గేట్ ఇంకా ఒక కిలోమీటర్’

’ఎత్తు ఎక్కే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి’

’పెట్రోల్ బంకు ఇంకా ఫలాన అన్ని కిలోమీటర్లు’

’రిఫ్రెష్‍మెంట్స్ అండ్ రెస్టారెంట్ ఫలానాన్ని కిలోమీటర్లు’

ఇలా రకరకాల బోర్డులు దర్శనమిస్తుంటాయి.

ఈ బోర్డులతో ఏమీ చింత లేదు. ఇవి అవసరమే కూడా.

ఇవి కాకుండా

’డోంట్ మిక్స్ డ్రింక్ అండ్ డ్రైవ్’

’అతివేగం ప్రమాదం’

’అత్యవసరమైన సమయంలో ఫలాన నంబర్‍కి ఫోన్ చేయండి’

’ఎడమవైపుకే ప్రయాణించండి’

’సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకండి’

’సీట్ బెల్ట్ పెట్టుకోండి’

ఈ తరహా బోర్డులు కూడా అవసరమే.

 

కానీ

’స్పీడ్ బ్రేకర్లు ఉన్నవి జాగ్రత్త’

’ఇరుకైన రహదారి’

’దగ్గర్లో స్కూలు ఉంది’

 ’ప్రమాదకరమైన మలుపు ఉన్నది జాగ్రత్త’

’ప్రమాదములు జరుగు ప్రదేశము’

ఈ తరహా బోర్డులు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలు అని నేను భావిస్తాను.

అంటే వాళ్ళ దృష్టిలో వాహనదారుల ప్రాణాలకి కనీ, పాదచారుల ప్రాణాలకి కానీ గడ్డిపోచకంటే ఎక్కువ విలువలేనట్టే గా.

అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనీ, ఇదివరకు అక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని తెలిసినప్పుడు అధికారులు ఏమి చేయాలి వాస్తవానికి?

అక్కడ ప్రమాదాలు జరిగే దానికి కారణం అన్వేషించి, దానికి అనుగుణంగా రహదారి నిర్మాణంలో ఉన్న లోటుపాట్లని సరిజేయాలి కద.

స్కూల్ ఉన్న దగ్గర ఫుటు ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయటం,

రోడ్డు వెడల్పు చేయటం, రెండు దారులకి మధ్యన విభాగిని (డివైడర్) ఏర్పాటు చేయటం, లేదా ఏదైనా రోడ్ వచ్చి అక్కడ ప్రమాదకరంగా కలుస్తొంది అంటే, రక్షణ చర్యలు చేపట్టి, అక్కడ సబ్ వే గానీ, ఫ్లై ఓవర్ కానీ ఏర్పాటు చేయటం. లేదంటే అక్కడ ఆ చిన్న దారిని కలువనీయకుండా చేసి, ప్రధాన రహదారికి సమాంతరంగా ప్రయాణం చేసేలా చేసి, ఒక దగ్గర కలిసి, ఆ తర్వాత యూ టర్న్ తీసుకునే లాగా ఏర్పాటు చేయలేరా?

హైదరాబాద్ నగరంలో మెట్రో స్టేషన్ల వద్ద నిర్మాణాన్ని ఎప్పుడైనా గమనించారా? స్టేషన్ తాలూకు ప్రయాణీకులు రోడ్డుకి ఇబ్బంది కలగజేయకుండా, రోడ్ ట్రాఫిక్ వల్ల  మెట్రో స్టేషన్ కి వెళ్ళి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎంత చక్కటి ఏర్పాట్లు చేశారో మీరే స్వయంగా చూడండి ఒకసారి.

మనిషి ప్రాణాలకి విలువ ఇస్తే నిర్మాణాలు ఇలాగే చేస్తారు.

అలా కాకుండా, ’ప్రమాదములు జరుగు ప్రదేశము’ అని ఒక బోర్డ్ పెట్టి, వీలయితే నాల్గయిదు వేగ నిరోధకాలు( స్పీడ్ బ్రేకర్లు) ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం పరిష్కారం కానే కాదు.

ఇటీవల ఎన్‍హెచ్ 44 పై ఇంకో కొత్త పోకడ గమనించాను. చిన్న చిన్న ఊర్ల దగ్గర అడ్డంగా హైవేని ఖండిస్తూ వెళ్ళే చిన్న దారి ఉన్న దగ్గర, ’ప్రమాదములు జరుగు ప్రదేశము’  అని ఇలా బోర్డ్ పెట్టి, రోడ్డు మీద మందంగా తెల్ల పెయింట్ తో స్పీడ్ బ్రేకర్ల లాంటివి ఏర్పాటు చేసి , ఆ జంక్షన్ దగ్గర ’జిగి జిగి జిగి జిగి’ అని వెలిగి ఆరే ఎరుపు, నీలం, పసుపు రంగు దీపాలు ఏర్పాటు చేసి నిర్భీతిగా చేతులు దులుపుకుంటున్నారు.

ఇది నిస్సందేహంగా దేశద్రోహమే.

ఒక ప్రాణం ఎంత విలువైందో వారికి తెలియదనా అర్థం? లేదా తొక్కలో ప్రాణంలే అన్న నిర్లక్షమా?

అంతర్జాతీయ నిభందనల ప్రకారం ఎక్స్ ప్రెస్ హైవేలపై స్పీడ్ బ్రేకర్స్ ఉండరాదు. కారణం విదితమే. నూరు నూట ఇరవైల వేగంతో వెళ్ళే వాహనం సడన్ గా బ్రేక్ వేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  అందుకే ఘనత వహించిన మన జాతీయ రహదారి అధికారులు, ఇలాంటి ప్రమాదకర , చౌకబారు ఏర్పాట్లు చేసి, తమ గౌరవాన్ని తాము పోగొట్టుకోవటమే కాక, నిండు ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు.

ఒక్కో దగ్గర వారు ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంటారు.

అవేంటంటే, అయిదారు నిలువెత్తు తారు డ్రమ్ములను వరుసగా ఒక దానిపక్కన ఒకటి  రోడ్డుకు ఎడం వేపునుంచి, రోడ్డుకి సగం దాకా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత కొన్ని అడుగుల దూరం వెళ్ళాక ఇందాకట్లాగే తారు డ్రమ్ములను ఈ మారు రోడ్డుకి కుడి వేపు నుంచి ఏర్పాటు చేస్తారు.

ఆ విధంగా కొన్ని అడుగుల తేడాతో, కుడి  ఎడమ వైపుల నుండి సగం దారిని, మూసేస్తారు. ఇప్పుడు రహదారి మీద వెళ్ళే వాహనం పాములాగా మెలికలు తిరిగి వెళ్ళాలి. ఇలాంటి ఏర్పాట్లతో భారీ లారీలు బోల్తా పడిన సందర్భాలు ఎన్నో. ఎక్కడో నక్సలైట్స్ సంచరించే అడవి రహదారులపై పోలీసులు ఇలాంటి ఏర్పాట్లు చేసి, వాహనాల వేగం తగ్గించి ఆపై తనిఖీ చేసే వారు. ఎక్స్‌ప్రెస్ హైవేలపై కూడా ఇలాంటి కాలం చెల్లిన విధానాలేనా?

ఇలాంటి ప్రమాదకరమైన రహదారులని జాతీయ రహదారులగా భ్రమించి, నూరూ నూటా యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటారు కొంతమంది.

’మేము కర్నూలు నుంచి బెంగళూరుకి అత్యంత వేగంతో ప్రయాణించి మూడు గంటల్లో చేరామ’ని ఒకరు,

’రెండున్నర గంటల్లో చేరామ’ని ఒకరు ఇలా పోటీలు పడి కబుర్లు చెప్పే బంధుమిత్రులని చూశాను. వారిని ప్రోత్సహించే మిత్రులని చూశాను.

మన రహదారులని గమనిస్తే ఇవి సాక్షాత్తు మృత్యుకుహురాలే అని మీకు అర్థం అవుతుంది

 

** హైవేపై సైతం, ఎదురుగా అతి వేగంతో దూసుకువచ్చే ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, మోటార్ సైకిళ్ళూ మీకు సర్వ సాధారణంగా కనిపిస్తాయి. వీళ్ళు ఏ మాత్రం తడబాటు లేకుండా నిర్భీతిగా వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మన న్యూస్ పేపర్లు కూడా ఇలాంటి వాటిని ఖండించకుండా, తప్పు ఎవరిది అన్న విషయం రాయకుండా సరైన దారిలోవెళ్తున్న పెద్ద వాహనందే తప్పు అన్నట్టు వ్రాస్తారు. ’నుపుర్ శర్మ విషయంలో గౌరవ న్యాయస్థానం వారి తీర్పు’ లాగే ఉంటాయి ఈ వార్తా పత్రికల కథనాలు.

** అడ్డంగా దూసుకు వచ్చే ద్విచక్రవాహనాలు

** నిర్భీతిగా రోడ్డుపై సంచరించే పశువులు

** రోడ్డు పై ధాన్యం  ఆరబెట్టటం తదితర పంట నూర్పుళ్ళకి సంబంధించిన వ్యవహారాలు

** వాహనం నుంచి బయటకి పొడుచుకుని వచ్చిన పొడగాటి ఇనుప చువ్వలు, ఇనుప కంబాలు ఇలాంటి దరిద్రాలన్నీ హైవేలపై కూడా ఉన్నాయి.

****

ప్రతి వాహనం కొనేటప్పుడు లక్షల రూపాయలు రహదారి పన్ను అని ప్రతి వాహన దారుడు కడతాడు. ఎందుకు కట్టాలి, ఇటువంటి రక్షణ లేని రహదారుల మీద ప్రయాణం చేయటానికి పన్ను?

అదికాక ఇటీవల టోల్‍గేట్లు అనే పేరు పెట్టుకుని నిస్సంకోచంగా వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.

పూర్వం టోల్ గేట్ వంటి ఆధునిక పోకడలు లేని రోజుల్లో ఉన్న దరిద్రాలన్నీ ఇప్పటికీ హైవేలపు ఉన్నాయి. కానీ టోల్ గేట్ పెట్టి వసూలు చేయటం మాత్రం ఆపరు.

ఒక రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే, కనీసమంటే ఓ మూడు నాలుగు టోల్ గేట్లు వస్తాయి మధ్యలో. ఒక్కొక్క టోల్ గేట్ వద్ద రమారమి నూరు రూపాయలు వసూలు చేస్తారు ఒక వైపు ప్రయాణానికి. అంటే కార్లో,  హైదరాబాద్ నుంచి కర్నూలు చేరే లోగా (రెండు వందల ముఫై కిలోమీటర్లు)లోగా, దాదాపు మూడు వందల రూపాయలు ఈ టోల్ గేట్లకి కట్టాల్సి వస్తుంది.

ఆల్రెడీ కార్ కొనేటప్పుడు లక్ష, లక్షన్నర దాకా రహదారి పన్ను కట్టాలి.

ప్రతి ప్రయాణంలో ఇలా రెండు వందలకిలోమీటర్ల దూరానికి దాదాపు మూడు వందల దాకా టోల్ కట్టాలి.

ఇంతా చేస్తే, ప్రయాణంలో భద్రత ఉంటుందా అంటె అది నేతి బీరకాయలో నెయ్యి వంటిదే.

***

నాయకత్వ లక్షణాలని గూర్చి చెబుతూ, "ఉత్తిగా విమర్శించటం ఎవరైనా చేస్తారు, పరిష్కారాలు చెప్పగలిగినవాడే సరిఅయిన నాయకుడు" అంటాడు చాణక్యుడు.

పేజీడు విమర్శలు గుప్పించి,  పరిష్కారం చెప్పకుంటే నా వ్యాసం అసంపూర్ణంగా ఉన్నట్టె లెక్క.

నేను నాకు తోచిన కొన్ని పరిష్కారాలు చెబుతాను ఇక్కడ.

పూర్తి రక్షణతో కూడిన జాతీయ రహదారి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే, మన నాయకులు విదేశియాత్రలు చేయాల్సిన అవసరం లేదు.

మన హైదరాబాద్ చుట్టు ఉన్న ’ఔటర్ రింగు రోడ్డుని అధ్యయనం చేస్తే చాలు’

** ఎనిమిది లేన్ల సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఇది. దీనిపైకి ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఎక్కేందుకు వీలు లేదు. నిర్ణీత ఎంట్రీ పాయింట్స్ దగ్గర మాత్రమే ఎక్కగలం, నిర్ణీత ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర మాత్రమే దిగగలం.

** ఎదురుగా ఏదో వాహనం వ్యతిరేక దిశలో వస్తుందన్న భయం ఏ మాత్రం ఉండదు దీనిపై. కళ్ళు మూసుకుని నడపవచ్చు (ఇది మాటవరుసకి అన్నమాట. నిద్రపోరాదు డ్రయివింగ్ చేసేటప్పుడు)

** ఏ ఎనిమిది లేన్ల రహదారి పది లేన్ల (10  Lanes)  రహదారిగా మారిపోతుంది, ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అర కిలోమీటర్  ముందు నుంచి. ఇంత పకడ్బందీగా నిర్మిస్తే ఎందుకు ప్రమాదాలు జరుగుతాయి.

** ఈ యావత్తు ఔటర్ రింగ్ రోడ్డు రాత్రి పూట కూడా పట్టపగలల్లే మెరిసి పోయేలా సౌరవిద్యుత్ తో దీపాలు వెలుగుతాయి

** ఎగ్జిట్ పాయింట్ ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనంగా పెద్ద పెద్ద బోర్డులు మనల్ని హెచ్చరిస్తాయి ఫలానా గమ్యం వస్తోంది అని.

** ఎక్కడా కూడా రోడ్ ఇంటర్ సెక్షన్లు ఉండవు. దీనిని అడ్డంగా ఖండించే ప్రతి రహదారి కూడా ఈ రోడ్డు కిందనుంచి వెళతాయి సాఫీగా, ఏ అడ్డూ రాకుండా.

** దీనికి తోడు ఈ ఎనిమిది / పది లేన్ల సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవే కి సమాంతరంగా అటూ ఇటూ కూడా సర్వీస్ రోడ్డు అనే పేరుతో, మరో నాలుగు లేన్ల రహదారులు ఏర్పాటు చేశారు కొనా మొదలు. టోల్ కట్టే ఉద్దేశం లేని వారు వీటిపై ప్రయాణీంచవచ్చు, అది ఒక ప్రయోజనం, ఇంకొక ప్రయోజనం ఏమిటంటె, ఒక ఎగ్జిట్ దగ్గర ఎక్స్‌ప్రెస్ హైవే దిగిన  వారు ఈ సర్వీస్ రోడ్డు పై ముందుకో వెనక్కో, ప్రయాణించి తమ గమ్యాన్ని అందుకోవచ్చు

***

ప్రతి జాతీయరహదారి ఈ విధమైన ఏర్పాట్లతో ఉండాలి. అపుడే వాటిని జాతీయరహదారి అని చెప్పవచ్చు.

కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?

ఎప్పుడో మధ్య యుగాలనాటి పద్దతులతొ నిర్మించిన రహదార్లను జాతీయరహదార్లు అనే పేరు పెట్టుకుని, వాటికి టోల్ చెల్లించుకుంటూ, ప్రాణాలని అరచేత్తో పెట్టుకుని ప్రయాణిస్తున్నాము. ఇంకా చిత్రం ఏమిటంటే, టోల్ గేట్ వద్ద డబ్బు కడుతున్నాం కాబట్టి ఈ జాతీయరహదారులు క్షేమకరమేఅని భ్రమకి గురయి నూరూ నూటాయాభై కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాం మనం.

***

కొసమెరుపు:

ఇంత పద్దతిగా నిర్మించిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా భయంకరమైన ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయినవారికి కొదవలేదు.

అధికారులు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి లోపం లేకుండా నిర్మాణాలు చేసినా, నిర్లక్షంగా డ్రైవ్ చేసే అల్పాయుష్కులైన వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డ్రైవర్లు కూడా అన్ని విధాలుగా సేఫ్ గా డ్రైవ్ చేయాలి కద.

 -డా.రాయపెద్ది వివేకానంద్

8.07.2022 Thursday.

No comments:

Post a Comment