Friday, October 8, 2021

భూత్ బంగ్లా (Published in Go Telugu .com)


భూత్ బంగ్లా 

-డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ 

హారర్ సినిమా చూసి వస్తున్నాం నేను మా శ్రీమతి.

వర్షం కారణంగా వైపర్స్ నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వర్షం కారణంగా నెమ్మదిగానే నడుపుతున్నాను.

"సినిమా ఏం బాగాలేదు" పెదవి విరుస్తూ అంది నా శ్రీమతి, "మీకోకటి తెలుసా, మా చిన్నప్పుడు మేము ఓ అద్దె ఇంట్లో ఉండేవారం, ఆ ఇంట్లో దెయ్యాలుండేవని చెపుతుండే వారు మా స్నేహితురాళ్ళు. మేము నాలుగేళ్ళున్నా మాకొక్క దెయ్యం కూడా కనిపించలేదు ఆ ఇంట్లో"

" అవునా, నా చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పనా? ఖచ్చితంగా ఈ హారర్ సినిమాకంటే థ్రిల్లింగా వుంటాయి" అన్నాను నేను.

"సరే చెప్పండి, కాలక్షేపంగా వుంటుంది" ప్రోత్సహించింది శ్రీమతి.

సరే మీరు కూడా వినండి

*****

జమ్మలమడుగు అంటే ఫాక్షన్ సినిమాలు  చూసే వారెవరయినా భయపడటం సహజం. అలాంటి జమ్మలమడుగులో నా బాల్యం ఒక సంవత్సరం గడిచింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ఒక జీవితకాలానికి  సరిపోయేటన్ని అనుభవాల్ని మూట కట్టుకున్నాను.  కాకపోతే మేము ఫాక్షనిజం వల్ల సినిమా కష్టాలు ఏమీ ఎదుర్కోలేదు కాని, ఇంకో రకంగా భయంకర అనుభూతుల్ని పొందటం జరిగింది.

దెయ్యంతో మా కుటుంబం ఎదుర్కొన్న కొన్ని చిత్రమైన అనుభవాల్ని చెప్తాను వినండి.

దాన్ని దెయ్యం అనాలా లేక ఏదైనా మానవాతీత శక్తా అన్నది మాకు ఎన్నటికీ అర్థం కాని ఒక ఆశ్చర్యం.

దాన్ని ప్రత్యక్షంగా చూసిన మా అప్ప. ఆ అనుభవాన్ని ఆయన  అందరికీ చెపుతున్నప్పుడు విన్న ఆ అనుభూతి ఇంకా నాకు గుర్తుంది.  అప్పటికి నాకూ మహా అంటే పన్నెండేళ్ళు వుంటాయి. ఇది జరిగి దాదాపు ముఫై ఎనిమిది సంవత్సరాలు అయినా అది నిన్నో, మెన్నో జరిగినట్టుగా తాజాగా వుంది నా స్మృతిలో. అక్కడి విషయాలన్నీఇప్పటికీ నాకు పూస గుచ్చినట్టు గుర్తున్నాయి. ఆ అనుభవాలు చిత్రంగా వుంటాయి. నాస్తికులు నమ్మకుంటే నేనేమీ చేయలేను.

మా అప్పకి ( నాన్న గారికి) ఒక భయానకమైన అనుభూతిని కలిగించేలా దెయ్యం  కనిపించింది.

ఆ ఇంట్లో మా చుట్టాలామెకి కనిపించింది దెయ్యం ఒక సారి కాదు, అనేక మార్లు.

నాకూ ఓ చిన్న సైజు అనుభూతి కలిగింది. అన్నీ వివరంగా చెపుతాను ఈ ఎపిసోడ్‍లోనే.

మా అప్పకు డిప్యూటి కలెక్టర్‍గా పోష్టింగ్ రావటంతో మా కుటుంబం జమ్మలమడుగు రావటం జరిగింది. సినిమాలలో చూపించే విధంగా ఏమి వుండదు అక్కడి పరిస్థితి. మనుషులంతా చాలా స్నేహశీలురు, కష్ట జీవులు. అక్కడి ప్రజలు చాలా అమాయకులు, నమ్మితే ప్రాణం ఇస్తారు.

మాకు దొరికిన ఇల్లు చాలా పెద్దది.  అదేం ఊరికి దూరంగా కూడా ఏమి ఉండదు. మామూలుగా అన్ని ఇళ్ళ మధ్యనే ఉండేది.  మా ఇంటి ఓనర్స్ కూడా మా ప్రక్కింట్లోనే ఉండేవారు. అప్పట్లో ఏవిధమైన ఆధునికమైన సౌకర్యాలు ఉండేవి కాదు ఆ ఇంట్లో. ఒక పెద్ద ఇల్లు అంతే. 

ఇప్పట్లో కనీస సౌకర్యాలైనట్టి ఓవర్ హెడ్ టాంకు, బాత్రూముల్లో కొళాయిలు కూడా వుండేవి కావు. మా ఇంటెదురుగా రోడ్డుకటువైపు వున్న ఓ పెద్ద  ఓపెన్ ప్లాటులో ఓ పెద్ద బావుండేది. మా నౌకర్లు ప్రొద్దునా, సాయంత్రం నీరు చేది బాత్రూంలో తొట్లలో నీరునింపే వారు. . నౌకర్లు పగలు మాత్రం పని చేసి వెళ్ళిపోయే వారు. రాత్రి కేవలం మా కుటుంబ సభ్యులం మాత్రమే వుండేవారం.

ఇంకో విషయం చెప్పాలి. అప్పుడు మేము గమనించలేదు గాని, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే జ్ఞాపకం వస్తోంది. ఆ వీధిలోని వారు అనేక మంది వచ్చి అదే బావిలో నీరు చేదుకునివెళ్ళే వారు.  వారంతా ఒక విధమైన ఆసక్తితో మాఇంటి వంక చూసే వారు. ’అరె! ఇందులో బాడుగకు (అద్దెకు) మనుష్యులు దిగారే’ అన్న ఆశ్చర్యం వారి కళ్ళలో కనిపించేది. కొందరు మాకు ఏదో చెప్పబోయి, తిరిగి మనకెందుకులే తంటా అన్నట్టువెళ్ళిపోయేవారు. మా ఇంటి ఒనర్లు కాస్తా బలమైన మనుషులు అన్నివిధాలా. అందువల్లనుకుంటాను జనం వెనుకంజ వేసేవారు.

ఆ ఇంట్లో ఓ రెండు గదులు తాళాలు వేయబడి, మా అధీనంలో లేకుండా , ఓనర్ల అధీనంలో వున్నాయి. ఆ రెండు గదులనుంచీ చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించేవి అప్పుడప్పుడూ, ఎలకల వల్లనుకుంటాను  .

మేడపైన ఓ పెద్ద హాలు, దానికి అటు, ఇటూ పేద్ద వరండాలు వుండేవి. ముందు వేపు వరండా మెయిన్ రోడ్ వైపుంటుంది. వెనుకువైపు వరండా దాటంగానే పెద్ద ఆరు బయలు. ఆ ఆరుబయలును కప్పేస్తూ ఇందాక చెప్పిన వేప చెట్టు కొమ్మలు విస్తారంగా ఆక్రమించి నీడను ఇస్తూ వుండేవి.

ఇంకా ఓపెన్ స్పేస్ కావాలంటే మేడపైని గది పైకి చేరుకుంటే బోలెడు ఓపెన్ స్పేస్.

ఆ ఇంటి వెనుక దూరంగా పెన్నా నది కనిపించేది. అందులో అరుదుగా నీళ్ళు ప్రవహించేవి. ఎప్పుడన్నా బాగా వర్షాలు వచ్చి, మైలవరం (కడప జిల్లా)  డ్యాం గేట్లు తీస్తే అందులో నీళ్ళు ప్రవహిస్తాయి, లేదంటే నిరంతరం ఇసుక మేటలు కనిపిస్తూ వుంటాయి.వేపచెట్టు కొమ్మలు అడ్డుగా వుండటం వల్ల మొదటి అంతస్థునుంచి చూచాయగాను, పై అంతస్థునుంచి బాగా క్లియర్ గాను కనిపించేది పెన్నానది. మా ఇంటి వెనుక ఇంకేమీ ఇండ్లువుండేవి కావు, మా ఓనర్ల తాలూకు చేనేత మగ్గాలు, పశువల శాలలు కనిపిస్తుంటాయి, వాటి కాంపౌండ్ వాల్ అయినపిమ్మట, బీడుపడిన పొలాలు, వాటి తర్వాత నది.  ఈ బీడు భూములలోనే పెద్ద వృక్షం ఒకటి వుండేది. అది ఏ చెట్టో నాకు సరిగ్గా గురుతు లేదు. పిల్లతనం ఉత్సాహంలో తెలిసేది కాదు గాని, అదేమి పెద్ద సేఫ్ ఎన్విరాన్‍మెంట్ కాదని ఇప్పుడనిపిస్తోంది.  పూర్తిగా రాంగోపాల్ వర్మ హారర్ సినిమాలకు సరిపోయే నేపధ్యం.

ఇక అసలు కథలోకి వద్దాం.

ఆ వృక్షం ఏదయితే వుందో దానిపై బోలెడు పక్షులు, కోతులు వుండేవి. కోతులు పగలంతా నిరంతరం పోట్లాడుకోవటం, పరిగేత్తి గెంతులెయ్యటం, గట్టి గట్టిగా కిచకిచలని మించిన స్థాయిలో అరచుకోవటం చేస్తువుండేవి . ఇక పక్షుల విషయానికి వస్తే అవి తెల్లవారు ఝామున, సాయంసమయాన  కిలకిలారావాలతో తెగ చిరాకు పెట్టేవి. అయితే రాత్రయ్యేటప్పటికి అవన్నీ నిశ్శబ్దంగా అయిపోయేవి. చిత్రమైన విషయం ఏమిటంటేరాత్రుళ్ళు నిశ్శబ్దంగా వుండే ఈ జీవులన్నీఒక్కోసారి అరుదుగా, రాత్రిపూట కూడా వున్నట్టుండి తీవ్ర సంచలనం చేసేవి. చాలాసేపటి తర్వాత అన్నీ సద్దుమణిగేవి. అదెందుకో మాకర్థం అయ్యేది కాదు అప్పట్లో (అఫ్‍కోర్స్ ఇప్పటికీ అనుకోండి).

కడపజిల్లాలో ఎండాకాలం చాలా భయంకరంగా వుంటుంది. పగలంతా చండప్రచండంగా మార్తాండుడు తన ప్రతాపం చూపిస్తాడు, ఇక రాత్రంతా ఉక్కపోత. ఈ కారణం వల్ల రాయలసీమలో ప్రజలు రాత్రిళ్ళు ఇంటిముందర ఆరుబయల్లో పడుకుని నిద్రపోయేవారు. మేడలున్న వారు మేడలపై పడుకొనే వారు. ఇది చాలా సహజమైన విషయం అక్కడి ప్రాంతాలలో. చిత్రంగా మా వీధీలో ఎవ్వరూ కూడా ఇలా ఓపెన్ ఎయిర్‍లో పడుకొనేవారు కాదు. ఇప్పుడు గుర్తొస్తొంది ఆ సంగతి కూడా.

మా కుటుంబం మాత్రం మేడపై ఓపెన్ ఎయిర్లో పడుకొనే వారం నిశ్చింతగా. రాత్రి ఎనిమిది, ఎనిమిదిన్నరకల్లా పడుకోనేవారం ఆ రోజుల్లో. నౌకర్లు మంచాలు, దోమతెరలు ఏర్పాటు చేసి వెళ్ళే వారు. కబుర్లు చెప్ప్కున్నంతసేపు చెప్పుకుని క్రమంగా హాయిగా నిద్రలోకి జారుకునే వారం.

మా అప్ప మాత్రం మా  గోలకి దూరంగా, పైమిద్దె పైకి వెళ్ళి పడుకొనే వారు. మేం పిల్లలం వెళ్ళి త్రాగే నీళ్ళ చెంబు, గ్లాసు పెట్టి వచ్చే వారం. మా అప్ప ట్రాన్సిస్టర్ తీసుకుని పైకి వెళ్ళి ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, ఏవయినా కర్ణాటక సంగీతాన్నో, ఏదయినా చర్చావేదికో వింటూ నిద్రలోకి జారుకొనేవారు. ఆ రోజుల్లో ఇంటిపెద్దలందరి పద్దతి ఇలాగె వుండేది.

ఇక నాకు ఒళ్ళు గగుర్పొడిచిన ఒక చిన్న అనుభూతిని మీకు చెప్తాను.

ఒకరోజు రాత్రి ఇలాగే పక్షులు, కోతులు గోలగోలగా అరుస్తుంటే నాకు మధ్యరాత్రిలో మెలకువ వచ్చింది. బాగా అలసిపొయినట్టున్నారు ఇంకెవ్వరికి మెలకువ రాలేదు.  యధాలాపంగా ఆ పెద్ద వృక్షాన్ని చూసి కాస్తా అదిరిపడ్డాను. పైనున్న చెట్టుకొమ్మకు ఎవరో మనిషి ఉరివేసుకుని వేలాడుతున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే తలనుండి కాళ్ళదాకా తెల్లటి నీడలాగా, మనిషి ఆకారంలో కత్తిరించిన ఒక తెల్లటి కటౌట్ లాగా వుంది తప్పనిచ్చి ఒక మనిషిలాగా జుత్తు, కాళ్ళు, చేతులు ఇలా స్పష్టంగా కనిపించలేదు. ఏదో భ్రమలెమ్మనుకుని నిద్రలోకి జారిపొయాను.  క్రమంగా కోతులు, పక్షుల చప్పుళ్ళూ మందగించాయి.

 తెల్లవారి మామూలుగానే మెలకువ వచ్చింది.భయపడాలి అని కూడా తెలిసే వయసు కాదది. అందరూ కాఫీలు త్రాగుతూవుండగా వెళ్ళి ఈ అనుభవాన్ని చెప్పాను, కాకపోతే ఉరివేసుకున్నట్టు కనపడింది అన్నది మినహాయించి ఏదో తెల్లటి ఆకారం కనపడింది అనె చెప్పాను.  ఉరి గిరి అంటే వయసుకు మించి మాట్లాడుతున్నానని కేకలేస్తారేమోనని కాస్తా భయపడ్డాను.

నేనూహించినట్టే అంతా తేలిగ్గా కొట్టేశారు, ఉత్తి భ్రమ అయివుంటుందని, నిద్రలో కలవచ్చివుంటుందని తీర్మానం చేసేసి ఆ విషయం అంతటితో ముగించారు.

ఇది జరిగిన కొన్ని రోజులకి ఇంకో చిత్రం జరిగింది.

మా పెద్దక్కయ్య అప్పుడు గర్భిణి. మా అక్కయ్య బయటపడుకోకుండా మేడపైనే వున్న పెద్ద గదిలో పడుకొంది. ఆమెకు తోడుగా మా చుట్టాలావిడ ఒకరు పడుకొనే వారు. మేమంతా మేడమీదే, ఆగది బయట ఆరుబయల్లో పడుకోని ఉన్నాం. మా నాన్నగారు పై అంతస్థులో ఆరుబయల్లో పడుకుని వున్నారు. 

ఒక సారి మధ్య రాత్రప్పుడు మా చుట్టాలావిడకి మెలకువ వచ్చి చూస్తే ప్రక్కనే మంచి వర్చస్సుతో కూడిన ఒక పెద్ద ముత్తైదువ కూర్చుని చిరునవ్వుతో పలకరించిందట. ఆమెవరో తెలియకున్నా మా చుట్టాలావిడ మొహమాటానికి చిరునవ్వు నవ్విందట. ఆ తర్వాత ఆమె చాలా చక్కగా కబుర్లు చెప్పి వెళ్ళిపోయేదట.

ఇలా కొన్ని రోజులు జరిగిందట. ఆ వచ్చినావిడ ఒకోసారి చాలా ఉత్సాహంగా కబుర్లు చెప్పేదట, ఒక్కోసారి దిగులుగా వుండేదట. ఒక్కోసారి అకారణంగా కోపం తెచ్చేసుకుని కర్ర తీసుకుని ఎడాపెడా మా చుట్టాలావిడని కొట్టేసేదట.

ఇంకా చిత్రమైన విషయమేటిటంటే ఆ వచ్చే ఆవిడ (దెయ్యం?) ఒక్కోరోజు ఒక్కో వ్యక్తి రూపంలో కనపడేదట. అదీ బ్రతికున్నవారి రూపాలలోనే. సాక్షాత్తు  అప్పటికి బ్రతికే వున్న మా దగ్గర బంధువుల రూపాలలోనే వేర్వేరు రూపాలతో వచ్చేదట.

ఇవేవీ ఆమె మాకు చెప్పేది కూడా కాదు. ఒక సంఘటన జరిగే దాకా. ఆ  సంఘటన ఏంటో చెపుతాను వినండి.

ఇదే అన్నిటికన్నా తీవ్రమయిన సంఘటన. అయితే ఒకటి మాత్రం నిజం. ఏ సంఘటనలోనూ ఎవ్వరికీ అపకారం గాని, గాయాలు గానీ కలుగలేదు.

అది మంచి పున్నమి రాత్రి. అంతా పడుకొని వున్నాం. నేను, మా ఇద్దరక్కయ్యలు, మా అమ్మగారు, మా పెద్దన్నయ్య మొదటి అంతస్థు ఆరుబయల్లోనూ, మా పెద్దక్కయ్య, చుట్టాలావిడ ఈ ఇద్దరూ  గదిలోనూ, మా నాన్నగారు పై అంతస్థు ఆరుబయల్లోనూ ఇలా ఎవరి స్థానాలలో వాళ్ళు పడుకుని ప్రశాంతంగా పడుకుని వున్నాం.

సాధారణంగా మా నాన్నగారు దేనికీ పెద్దగా ఉద్వేగానికి గురవ్వరు. ఆయనకి మూఢనమ్మకాలు కూడా ఏమీ లేవు. పిచ్చి పిచ్చి నమ్మకాలు, తాయెత్తులు గట్రా సెంటిమెంట్లు కూడా ఏమీలేవు. అలాంటి కథలు ఎవరయినా చెపితే కూడా నవ్వి వదిలేస్తారు.

సడెన్‍గా మెలకువ వచ్చి లేచి కూర్చున్నాను ఒక రాత్రి. మేడపైనుంచి దిగి వచ్చినట్టున్నారు మా నాన్నగారు. ఆయన బనీన్ అంతా చెమటతో తడిసి పోయుంది. బాగా ఆయాస పడిపోతున్నారు.

అప్పటికే అందరూ లేచి ఆయన చుట్టు కూర్చుని ఆయనని సేదతీరుస్తున్నారు.

నేను వెళ్ళి మాఅమ్మగారిప్రక్కనే కూర్చున్నాను. నాకర్థమయినదాన్ని బట్టి ఆయన అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనని చూశారు. అదేంటంటే...........

*****

ఎప్పట్లాగే ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, కాసేపు సంగీతమేదో విని ట్రాన్సిస్టర్ రేడియోని ఆపేసి నిద్రకుపక్రమించారట మా నాన్నగారు ఆరాత్రి కూడా.

 

ఒక రాత్రప్పుడు ఎవరో తట్టిలేపుతున్నట్టనిపిస్తే మెలకువ వచ్చిందట. మెలకువ వచ్చి కళ్ళు కూడా తెరవకముందే ఆయనకి పక్షుల గోల, కోతుల అలజడి వినిపించిందట. ఏంట్రా తెల్లవారిందా అని అనుకుని కళ్ళు తెరిచి చూస్తే ఇంకా చీకటి వీడలేదు.

అప్పుడు వినిపించిందట ఆయనకి "ఒరే హనుమంతుడూ (మా అప్ప పేరు హనుమంతరావు గారు) బావున్నావా?" అన్నపిలుపు ఆప్యాయంగా.

అప్పుడు చూశాడట మానాన్నగారు రమణమ్మని (పేరు మార్చబడింది).

ఆవిడ మాకు దూరపు బంధువు. కాని వారి కుటుంబంతొ మాకు బాగా సాన్నిహిత్యం వుంది . మా నాన్న గారికంటే బాగా పెద్దావిడ ఆమె. అందుకే ఆయనని ’ఒరె, నీవు అని ఏకవచనంతో సంబోధించే చనువు వుంది ఆవిడకి. రమణమ్మగారు పెద్దముత్తైదువ. అప్పటికే అరవైపైన వుంటాయి ఆవిడకి. పెద్ద కుంకుమ బొట్టు, సోడాబుడ్డి లాంటి కళ్ళజోడు, చింపిరి జుత్తు, మడతలు పడి నలిగిపోయిన కాటన్ చీర, ఆవిడ అప్పుడే ప్రయాణం చేసొచ్చినట్టుంది.

చాలాసేపు అప్యాయంగా మాట్లాడిందిటఅందరి గురించి పేరు పేరునా క్షేమసమాచారాలు అడిగి కనుక్కుందిట. వాళ్ళ ఊరి విశేషాలు, క్షేమ సమాచారాలు తెలియజెప్పిందిట. ఆవిడ నిజంగానే మా రమణమ్మ అత్త అనే అనుకున్నాడట మా నాన్న.

ఆవిడ ప్రవర్తన తేడాగా ఏమీ అనిపించలేదు. బహుశా అప్పుడే ప్రయాణం చేసొచ్చినట్టుంది. అలసటగా కూడా వుంది.  అయినా సరే వచ్చి పలకరించాలని పైకి వచ్చి మాట్లాడిస్తోంది అనే అనుకున్నారట.

కాసేపయ్యాక  ’పదరా క్రిందకెళదాం అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చని’ చెప్పి నడవటం మొదలెట్టింది రమణమ్మ.

ఆవిడ వెనుకే మానాన్నగారు కూడా నడవటం మొదలెట్టారు. మేడపైన సగం దాకా వచ్చాక , ఆవిడ మెట్లున్న వైపునకు కాకుండా తిన్నగా ముందుకే వెళుతోందట. అలాగే ముందుకు వెడితే  పారపెట్ వాల్ కూడా లేని ఆ మూడంతస్తుల మేడపై నుంచి కింద పడటం ఖాయం. క్రింద మా ఓనర్ల తాలుకు పశువుల శాల, మగ్గాలు వున్నాయి.

రమణమ్మా అలా కాదు, ఇటు వేపు’ అని మా నాన్న హెచ్చరిస్తూనే వున్నా కూడా ఆవిడ ఇక ఏమీ పలక్కుండా అలాగే ముందుకే వెళ్ళి వెళ్ళి అలాగే నడచుకుంటు, ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత, కాసేపు గాల్లోనే నడిచి ఆపై అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయి చూస్తూ వుండగానే గాల్లో కలిసిపోయిందట.

అప్పుడు కలిగింది భయం మా నాన్నగారికి, మొదటి సారి.

పెద్దగా కేకలు పెట్టుకుంటు పరిగేట్టుకుంటు క్రిందికి వచ్చేశారు.

అదీ జరిగింది.

ఇది ఏదో సినిమాలో అయితే చూడటానికి బాగుంటుంది కాని ఒక సామాన్యమయిన మనిషికి అస్సలు ఎన్నడూ ఊహకుకూడా రాని విధంగా ఇలా జరిగితే ఎలా ఉంటుందో వివరించటానికి మాటలు చాలవు. ఆ రాత్రి ఎవ్వరికి నిద్ర లేదు. అలాగే చర్చించుకుంటూ వుండిపోయారు పెద్ద వాళ్ళందరు.

ఇది భ్రమనా నిజమా అని చాలా సేపు విచికిత్సకి గురయ్యారు. ఏదయినా పీడకల వచ్చిందేమోనని కూడా అనుకున్నారు. ఘంటాపదంగా మా నాన్నగారు అది నిజంగా జరిగిందేనని నొక్కివక్కాణించారు.

ఈ హడావుడికి గదిలో పడుకున్న మా చుట్టాలావిడ కూడా బయటకు వచ్చి జరిగిందంతా విని, అప్పుడు ఏకరువు పెట్టింది తన అనుభవాల్ని.

అందరికీ మిడిగుడ్లు పడ్డాయి.

తరువాత ఉదయాన్నే రమణమ్మ వాళ్ళ ఊరికి ఎస్.టీ.డీ కాల్ బుక్ చేసి మాట్లాడితే ఆవిడ నిక్షేపంగా వున్నారని తెలిసింది.

ఇలా లాజిక్‍కి అందని సంఘటనలు జరిగాయి ఆ ఇంట్లో. అయినా మా వాళ్ళు ఇల్లు మార్చాలని ఏమీ అనుకోలేదు.

మరో ఆరునెలలకు మా నాన్నగారికి నూజివీడు ట్రాన్స్ఫర్ అయ్యింది.

అంతే ఇంతకు మించి ఏమి జరగకున్నా, మాటల్లో వ్యక్త పరచలేని ఒక విధమైన్ ఉద్విగ్నతకి గురవుతాము మా ఇంట్లో అందరమూ ఈ సంఘటనల్ని తలుచుకున్నప్పుడల్లా.

 

****

"ఓ! మై గాడ్ ఇదంతా నిజమా!" గుడ్లు తేలేసింది నా శ్రీమతి.

 

ప్రియమైన పాఠకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.

మేమా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన అయిదారు సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో అద్దెకి దిగారట మా శ్రీమతి వాళ్ళు, తన చిన్నతనంలో. చిత్రంగా వారికి ఎటువంటి అనుభవాలు ఎదురు కాలేదట. మా శ్రీమతి వాళ్ళ స్నేహితురాళ్ళు చాలానే చెప్పారట ఆ ఇంటి గురించి స్కూలుకు వెళ్ళినప్పుడు.

మాకెవ్వరూ చూచాయగా కూడా చెప్పలేదు, కానీ మాకేమో చిత్రాతిచిత్రమైన అనుభవాలు.

ఏంటొ అంతా విచిత్రం.

పావులు - the Scape Goats (Published in Sanchika the Web magazine)


 

పావులు - the Scape Goats

-డా.రాయపెద్ది వివేకానంద్

 

తుపాకి పేలిన చప్పుడు.

నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ చలి రాత్రి ఊహించని విధంగా వినిపించిన ఆ శబ్దానికి నాకు మెలకువ వచ్చింది. అప్పుడు సమయం రాత్రి రెండు దాటి ఉంటుంది.

నేనెక్కడ ఉన్నది కాసేపు అర్థం కాలేదు. లేత నీలిరంగు కాంతి గది అంతా మంద్రంగా పరచుకుని ఉంది. ఆ కాంతిలో గదంతా ఒకసారి పరికించి చూశాను.

ఖరీదైన ఫర్నిచర్, ఖరీదైన తెరలు, ఐశ్వర్యం ఉట్టిపడుతున్న వాతావరణం, తగుమాత్రం ఉష్ణోగ్రతను అందిస్తూ చలివాతావరణం నుంచి కాపాడుతూ ఉన్నఆధునిక ఎయిర్ కండిషనర్లు. ఇది మా ఇంట్లో నా గది కాదే.

గాఢమైన నిద్రనుంచి దిగ్గున లేవడం వల్ల నాకేమర్థం కావడం లేదు.

డబల్‍కాట్ పై నా పక్కనే పడుకుని ప్రశాంతంగా నిదురిస్తున్న కవితని చూశాక క్రమంగా గుర్తువస్తోంది మేము క్రితం రోజే ముంబాయికొచ్చాము అని,  తాజ్ హోటల్లో ఉన్నాం మేము ఇప్పుడు అని. మాకు పెళ్ళయి ఇంకా నాలుగు రోజులు కూడా అవలేదు. నిద్రలోనే కవిత ఎందుకో చిరునవ్వు నవ్వుకుంటోంది, ఏమి గుర్తు వచ్చిందో తనకు.

లేచి కూర్చుని తన దుప్పటిని సవరించాను. తన నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని, మంచంపై నుంచి దిగాను. నాకు నిద్రమబ్బు పూర్తిగా వదిలిపోయింది.

సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న కవిత అన్నయ్యలు ఇద్దరూ మాకు ఇచ్చిన సర్‍ప్రైజ్ గిఫ్ట్ ఇది. వాళ్ళు మా హనీమూన్‍ని ఇలా ప్లాన్ చేసి మమ్మల్ని ముంబాయి ఫ్లయిటు ఎక్కించి పంపారు.  మొదట ముంబాయిలో ’గేట్ వే ఆఫ్ ఇండియా’ పక్కనే ఉన్న అతి ఖరీదైన అయిదు నక్షత్రాల తాజ్ హోటల్లో ఓ మూడు రోజులు బస చేసిన అనంతరం, ఇట్నుంచి ఇటే స్విట్జర్లాండు లో ఓ వారం గడిపేలా ప్రణాళిక చేశారు.

పగలంతా బీచ్ వగైరాలు చూసి అలసిపోయి పడుకున్నాం.

తిరిగి తుపాకి పేలిన చప్పుళ్ళు వినిపించాయి. ఆగకుండా వరుసగా మిషన్ గని పేలిన చప్పుళ్ళుగా పోల్చుకోగలిగాను.  చాలామంది జనం భయవిహ్వవులులై ప్రాణ భయంతో పరుగులు పెట్టిన చప్పుళ్ళు కూడా స్పష్టంగా వినిపించాయి.

నాకు వెన్నులో చలి పుట్టింది.

కవిత నిద్రలోనే కాస్తా ఇబ్బందిగా కదిలింది. ఆమె పెదాలపై చిరునవ్వు మాయమైంది ఈ సారి.

ఇంకొద్ది సేపట్లో మాకు జరగబోయే బయానకమైన అనుభవాలు తనకు చూచాయగా తెలిసినా తాను అలా నిశ్చింతగా నిద్రపోయేది కాదు, నేను ఆ మాత్రం నింపాదిగా ఉండేవాడిని కాదు.

భూమి మీద నరకం ఎలా ఉంటుంది అన్నది ప్రత్యక్షంగా మేము చూడబోతున్నాము అన్న విషయం మా ఇద్దరికీ ఏమాత్రం తెలియదు ఆ క్షణంలో.

ఇప్పుడు తిరిగి నిశ్శబ్దం అలముకుంది. అది తుఫాను ముందటి ప్రశాంతి అని నాకు ఎందుకో అనిపించింది ఆ క్షణం.

ఏసీ చేస్తున్న మంద్రమయిన ధ్వని, కవిత ఉఛ్వాస నిశ్వాసలు మినహాయించి గదంతా నిశ్శబ్దం అలముకుంది.

బయట నుంచి కూడా ఏమీ శబ్దాలు వినిపించడం లేదు.

ఇందాక నేను కలగన్నానా?

మిషన్ గన్ తాలూకూ చప్పుళ్ళూ నాభ్రమేనా? ఎందుకో తెలియదు ఆ ఊహ నాకు కాస్తా నెమ్మదిని ఇచ్చింది.

వాస్తవానికి కొత్తగా పెళ్ళయిన యువకుడు విపరీతమైన వత్తిడికి గురవుతాడట. ’ఈ బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించగలనా? జీవితాంతం ఈమెకి నేను న్యాయం చేయగలనా? నన్ను ఇంతగా నమ్ముకుని అందర్నీ వదిలేసి వచ్చిన ఈ స్త్రీ నమ్మకాన్ని నేను నిలుపుకోగలనా?’ ఇలాంటి అలోచనలతో పురుషుడు మానసిక వత్తిడికి గురయితే, స్త్రీ ఇంకో లాగా అలోచిస్తుందట.

’ఇక నా బాధ్యతంతా ఇతడు చూసుకుంటాడు. నాకే భయం అక్కరలేదు. ఇతడు నా తోడున్నాడు చాలు’ అనే భరోసాతో స్త్రీ నిశ్చింతగా ఉంటుందట.

కొద్దిగా సైకాలజీ తెలుసు అని అనుకునే మిత్రుడు రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాను.

ఈ వత్తిడి వల్ల నాకు నిద్రలో మెలకువ వచ్చినట్టుంది అని అనుకుని రిలీఫ్ గా నిట్టూర్చి బాత్రూంకి వెళ్ళిచ్చి, నీళ్ళు త్రాగబోతున్నాను.

నా నిశ్చింత క్షణమాత్రమే అని నిరూపిస్తూ, అప్పుడు వినిపించింది గుండెలవిసిపోయేలా పెద్ద చప్పుడు. బాంబు పేలిన చప్పుడు ప్రత్యక్షంగా ఎప్పుడు వినకపోయినా చప్పున పోల్చుకోగలిగాను చాలా పెద్ద విస్ఫోటనం సంభవించింది అని.

కవిత దిగ్గున లేచి కూర్చుంది.

నా చేతిలో గ్లాసు భళ్ళున క్రిందపడి పెద్ద చప్పుడు చేస్తూ పగిలిపోయింది.

రెండగ్గల్లో వెళ్ళి కిటికీ తెర తొలగించి బయటకు చూసిన నేను నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. భయంతో మా ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి.

తొమ్మిదో అంతస్థు కిటికీలోంచి చూస్తూ ఉండటం వల్ల మాకు బయట జరిగేదంతా స్పష్టంగా కనిపిస్తోంది.

బయట విద్యుత్ దీపాల కాంతిలో పట్టపగలల్లే వెలుతురు ఉంది. రోడ్డుకు దగ్గరలోనే అరేబియన్ సముద్రం ప్రశాంతంగా కనిపిస్తోంది. కాస్తా ఎడంగా గేట్ వే ఆఫ్ ఇండియా జరగుతున్న వినాశనాన్ని గుడ్లప్పగించి చూస్తొంది.

సుమారు పదెహేను మంది యువకులు సాయుధులై మా హోటల్ కి ఎదురుగా నిలబడి ఉన్నారు. వాళ్ళను దిగబెట్టటానికి వచ్చిన నౌక  సముద్రంలో తిరుగు ప్రయాణానికి సిద్దమౌతోంది.

ఈ యువకులు అందరు ఆ నౌకలోని వారికి సైనిక వందనం లాంటిది చేసి వీడ్కోలు చెప్పారు.

రాత్రి పడుకోబోయే ముందు కూడా అదే కిటికీలోంచి సముద్రాన్ని, గేట్ వే ఆఫ్ ఇండియా ని చూస్తూ కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.

తాము సృష్టించబోయే మారణహోమానికి నాందిగా వారు అక్కడే ఆగి ఉన్న ఒక ఖాళీ టూరిస్టు బస్సుని హేండ్ గ్రెనేడ్ వేసి పేల్చేసినట్టుగా అర్థమవుతోంది, ఆ బస్సులోంచి ఎగసి పడుతున్న మంటలని బట్టి.

ఆ యువకులు అందరూ ఆజానుబాహులుగానూ , బలాఢ్యులుగాను ఉన్నారు. వాళ్ళ అందరి దగ్గరా భయంకరమైన మారణాయుధాలు ఉన్నాయి.

వాళ్ళలో నాయకుడిలాంటి వాడొకడు, తనెదురుగా నిలబడ్డ మిగతా వారందరికి గాల్లో చేతులు ఎగరేస్తూ ఏవో సూచనలు అందజేస్తున్నాడు.

నాకర్థమయిన దాన్ని బట్టి ఆ మహానగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళీపోయి మారణహోమం సృష్టించమని చెబుతున్నట్టుగా తోచింది.

సూచనలు అందుకున్న వారు జట్లు జట్లుగా ఆ నాయకుడికి అభివాదం చేసి యుద్ధోన్మాదంతో నిండిన హుంకారాలు చేస్తూ, చిరుతల్లాగా కదులుతున్నారు.

వారందరూ ఒకే విధమైన నల్లటి దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించి ఉన్నారు. ముసుగుతో వారి తల మొత్తం కప్పబడి ఉంది, ఉత్తిగా వారి కళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి.

రోడ్డు పక్కన్ టాక్సీలు ఆపుకుని నిద్రిస్తున్న టాక్సీ డ్రయివర్లను హతమార్చి టాక్సీలను హస్తగతం చేసుకుని , ఇద్దరేసి చొప్పున ఒక్కో కారు ఎక్కి వివిధ దిశల్లో వేగంగా కదిలిపోయారు.

ఆ నాయకుడు లాంటి వాడు , వాడికి తోడుగా ఇద్దరు సాయుధులు మా హోటల్ కి ఎదురుగా నిలబడి పోయారు కాసేపు.  ఆ తరువాత వారు మెల్లిగా మేమున్న హోటల్ ప్రధాన ద్వారం వైపు రావడం మొదలెట్టారు.

ఇదంతా నా కళ్ళ ముందరే జరిగిఉండకపోతే నేను అస్సలు నమ్మి ఉండే వాడిని కాదు ఇలాంటి సంఘటన జరుగుతుందని.

బయట జరుగుతున్న ప్రతీ దృశ్యం మాకు స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తోంది.  ఈ గదిని ప్రత్యేకంగా మేము ఎన్నుకోవటానికి కారణం ఇదే. నగరాన్ని సముద్రాన్ని స్పష్టంగా చూడ్డానికి వీలుగా ఉంటుందని మా బామ్మర్ది ఎంతో ముందుగా ఆన్‍లైన్‍లో ఈ గదిని ఆ రిజర్వ్ చేయించి ఉంచాడు.

ఈ గదిని ఎన్నుకోవడం ద్వారా నేను కవిత పెను ముప్పును ఎదుర్కొంటామని మాకు అప్పుడు తెలియదు.

నాయకుడు, సాయుధులైన అతని ఇద్దరు  అనుచరుల బృందం నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరుపుకుంటూ కదిలే మృత్యువులాగా మా హోటల్ ప్రధాన ద్వారం వైపు రాసాగారు.

ఈ పరిణామాన్ని నేను అస్సలు ఊహించలేదు.

సెక్యూరిటీ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమై ఎదురుదాడికి దిగారు. కానీ ఘర్షణ ఏకపక్షంగా సాగింది.  ఒక చిన్నపాటి ముఖాముఖి పోరాటం తరువాత ఆ సాయుధ అగంతకుల బృందం హోటల్ తాలూకు రక్షణ సిబ్బందిని మట్టికరిపించటమేమిటి, వారిని అత్యంత పాశవికంగా హతమార్చటమేమిటి క్షణాల్లో జరిగిపోయాయి.

ఇప్పుడు ఆ ముగ్గురు హోటల్ ప్రాంగణంలోకి ప్రవేశించి, కోట గుమ్మాలలాంటి హోటల్ మెయిన్ గేట్లను మూసివేసేసారు. వారి ప్రతి కదలికలోనూ ఖచ్చితత్వం, అప్రమత్తత, యుద్ధనైపుణ్య శైలీ తేటతెల్లంగా  కనిపిస్తున్నాయి.

ఇవన్నిటికన్నా వారిలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న మరో ప్రధాన అంశం మృగత్వం.

’ముష్కరుల దాడిలో అసువులు బాసిన పౌరులు’ అన్న మాటలని వార్తా పత్రికల పతాక శీర్షికలలో చూస్తూ ఉంటాము, అది ఈ వేళ కళ్ళారా చూస్తున్నాను.

ఇప్పుడు  స్పష్టంగా ఒక విషయం అర్థం అయిపోయింది. ఆ హోటల్ ప్రాంగణం  మొత్తం వారి హస్తగతమైంది ఇప్పుడు. మేము అందరం వారి బందీలము.

ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోవటానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. భయంతో కవిత నన్ను బలంగా కౌగిలించుకుని, నా భుజం మీద తలపెట్టి ’ఇప్పుడెలాగండీ’ అన్నది బేలగా. ఆమె తల నిమురుతూ ఉండటం మినహా నేనేమి సమాధానం చెప్పలేకపోయాను. నాకు కూడా చాలా అయోమయంగా ఉంది.

నేను కిటికీ గాజు తలుపు గుండా వారినే గమనిస్తున్నాను. నా కనుచూపు పారినంతమేరా వారి కదలికలను గమనించగలిగిగాను. వారు చివరికి హోటల్ తాలుకూ పోర్టికోలోకి, అట్నుంచి హోటల్ రిసెప్షన్ విభాగం వైపు కదిలి చివరికి హోటల్లోనికి ప్రవేశించారు.

ఇక మా ప్రాణాలు ఉండటం లేదా పోవటం  పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంది అన్నది అర్థమయింది.

నన్ను చుట్టేసుకున్న కవిత స్పష్టమైన కంఠస్వరంతో మృత్యుంజయ స్తోత్రం చదువుకుంటోంది.

కిటికీలోంచి మరోసారి బయటకు దృష్టి సారించాను.

రోడ్ జంక్షన్ నిర్మానుష్యంగా ఉంది. నిశ్చేతనంగా పడిఉన్న టాక్సీ డ్రయివర్ల శరీరాలు, కాలిపోయిన టూరిస్టు బస్సు ఇందాకటి సంఘటనకి సాక్ష్యాలుగా ఉన్నాయి.

ఇంతలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పోలీసు వాహనాలు కుయ్...కుయ్ మని సైరన్ మ్రోగించుకుంటూ వచ్చేశాయి. చీమల పుట్టలోంచి బయటపడ్డ చీమల్లా అనేక మీడియా వాహనాలు వచ్చేసాయి.

కెమరా వంక చూసుకుంటూ టక టకమని టీవీ విలేకరులు మాట్లాడేస్తున్నారు. కేమెరామెన్లు ఆ విధ్వంసాన్ని చూపుతూ విలేకరుల మాటల్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు.

మీడియా వారికి పండగే కద ఇక.

మీడియా వారికి కానీ, పోలీసులకు కానీ తెలియని విషయం ఏమిటంటే ఆ దుండగులలో ముగ్గురు మా హోటల్లోకి ప్రవేశించారని.

హోటల్ తాలూకు సెక్యూరిటీ గార్డుల శరీరాలు హోటల్ కాంపౌండ్ లో ఉండిపోయాయి. ఇక్కడ ఘర్షణ జరిగింది అనేదానికి సంబధించిన ఏ ఆనవాలు హోటల్ గేట్ బయట దొరకకుండా జాగ్రత్త పడ్డారు ఆ దుండగులు.

నాకు మొదటి సారి తుపాకి మోత వినిపడి మెలకువ వచ్చినది లగాయతు ఈ క్షణం వరకు కేవలం పదే పది నిమిషాలు గడిచాయి. ఈ సంఘటనలన్నీ వరుసక్రమంలో ఇంత తక్కువ సమయంలో జరిగిపోయాయంటే వాళ్ళు ఈ ప్రక్రియని ఎంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులు, పారామిలిటరీ దళాలు, పత్రికలవారు అంతా వచ్చారు. ఇక మేము ఏమాత్రం వంటరి వారం కాదు అన్న భరోసా అయితే లభించింది కానీ, ఇక్కడ ఒక చిక్కేమిటంటే మా హోటల్లోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్టు పోలిసులకు తెలియదు.

 అదే విధంగా ఒక డజను మంది నరరూప రాక్షసులలాంటి ఉగ్రవాదులు నగరంలోని వివిధ ప్రాంతాలకు నిశ్శభ్దంగా వెళ్ళిపోయినట్టు కూడా వారికి తెలుసోలేదో నాకు తెలియదు.

ఈ లోగా పోలీసులతో పాటు వచ్చిన వాసన చూసే శునకాలు (స్నిఫర్ డాగ్స్) మా హోటల్ గేట్ ముందుకు వచ్చి భీకరంగా మొరగసాగాయి. పోలీసులు అప్రమత్తమత్తులై గేటు ముందు అర్ద వలయాకారంలో నిలబడ్డారు. ఎవ్వరూ ఊహించిని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

ఉగ్రవాదుల్లో ఒకడు హోటల్ కాంపౌండ్ లోకి వచ్చి గేటు మీదుగా బయటకు ఏదో విసిరాడు. చాలా పెద్ద శబ్దంతో పెద్ద విస్పోటనం జరిగింది.

అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.

దాంతో పోలీసులకు, పారా మిలటరీ వారికీ అర్థం అయింది, తాము ఎదుర్కుంటున్నది సామాన్యులను కాదు, ఏదో పెనుముప్పే పొంచి ముందని.

వారు క్షణాల్లో రోడ్డుకి అటువైపుగా వెళ్ళి పోయి, తమ వాహన శ్రేణులవెనుక నక్కి కూర్చున్నారు. క్షణాలు యుగాలలాగా గడుస్తున్నాయి.

ఏమి జరగబోతోందో ఎవ్వరికీ అర్థం అవ్వటం లేదు.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

కవిత నోటి వెంట నిరంతరాయంగా మహా మృత్యుంజయ మంత్ర పఠనం కొనసాగుతోంది.

అప్పుడు వినిపించింది ’టక్...టక్’ మని ఎవరో తలుపు తడుతున్న ధ్వని. భయంతో నా నవనాడులు స్తంభించిపోయాయి. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

కవిత వంక చూశాను.

అసలే పెద్దవైన తన కళ్ళు భయంతో మరింత పెద్దవయ్యాయి. వళ్ళంతా చెమటలు పట్టేశాయి మాకు.

తలుపు తడుతున్న ధ్వని క్రమక్రమంగా పెద్దదైంది. ఎటువంటి మర్యాద, పద్దతీ పాఠించకుండా చాలా బలంగా మోదుతున్నారు బయట నుంచి. ఆ తలుపు మోదే విధానంలోనే వారి మొరటుదనం అర్థం అవుతోంది.

ఇక తలుపులు తెరవక తప్పదన్నట్టు కదలబోయాను తలుపు వంక. తలుపుదిశగా కదలబోతున్న నన్ను ’వద్ద’న్నట్టు నిలువరించింది కవిత.

"ఆ టెర్రరిస్టులైతే ఎలా?" బేలగా ప్రశ్నించింది కవిత

నా ఉద్దేశంలో , తలుపు అవతల ఉన్నది టెర్రరిస్టులు అయిన పక్షంలో తలుపులు తెరవటమే మంచిది. లేని పక్షంలో వారి సహనాన్ని పరీక్షించడమే అవుతుంది. తలుపులు బద్దలు ఎలాగూ బద్దలు కొడతారు, ఆ ఉక్రోషంలో మమ్మల్ని హతమార్చినా ఆశ్చర్యం లేదు.

అందువల్ల వారికి సహకరించటమే సరి అయిన పని అని అనిపించింది . భరోస ఇస్తూ, కవిత చెయ్యి నెమ్మదిగా వత్తి , తనని విడిపించుకుని తలుపు తీశాను.

తలుపు తెరవడం ఆలశ్యం, ఓ ఇద్దరు మా గదిలోకి బలవంతంగా తోయబడ్డారు.

’భగవంతుడా ఏమి జరుగుతోంది?’ అనుకుంటు వారి వంక చూశాను. మా పక్క గదిలోని జంట వారు. వారిని ఉదయాన్నే చూశాను.

చూస్తుండగానే మా గదంతా ఇలా బలవంతంగా లోనికి తోయబడ్డవారితో నిండిపోయింది.

నాతో కలిపి కనీసం ఓ ఇరవై మందిమి ఉంటాము. అంత మందిమి ఉన్నాకూడా ప్రాణభయంవల్ల ఎవ్వరూ మాట్లాడటం లేదు. నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది.

చూస్తుండగానే మళ్ళీ తలుపు తెరచుకుంది. ఈ సారి ఆ టెర్రరిస్టుల నాయకుడు, అతని ఇద్దరు అనుచరులూ లోనికి ప్రవేశించారు.

ఆ నాయకుడి లాంటి వాడు నింపాదిగా ఎటువంటి టెన్షన్ లేకుండా లోనికి వచ్చేసి, ఓ కుర్చీ లాక్కుని నేను ఇందాక నిలబడ్డ కిటికీ పక్కగా కూర్చున్నాడు.

అతను మమ్మల్నెవర్నీ పట్టించుకోకుండా నింపాదిగా బయటకు ఏకాగ్రతగా చూస్తుండిపోయాడు. అతడి వద్ద బైనాక్యులర్స్, ప్రాణాంతక ఆయుధాలు, సెల్ ఫోన్ ఉన్నాయి.

వాడు సెల్ ఫోన్ లో స్వచ్చమైన ఉర్దూలో  నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు.

మిగిలిన ఇద్దరూ తలుపు దగ్గరే నిలబడి పోయి మమ్మల్ని అందర్నీ అప్రమత్తంగా గమనిస్తూ ఉండి పోయారు.

వారు అంతా ఒక పదిహేను మంది మోటార్ బోట్ లో అరేబియా సముద్రం మీదుగా గేట్ వే ఆఫ్ ఇండియా వరకు వచ్చారని, వారు అంతా ఏదో పెద్ద ప్రణాళికతోనే వచ్చారని అర్థం అయింది వారి సంభాషణని బట్టి.

ఆ పెద్ద ప్రణాళిక ఏమిటి అన్నది అర్థం అవ్వలేదు. కాకపోతే అ ప్రణాళికలో భాగంగా మమ్మల్ని బంధిలుగా పట్టుకున్నారు అని అర్థం అయింది. ఇది గుడ్డిలో మెల్ల అని కాసేపటికి అర్థం అయింది. కాసేపటి క్రితమే వారు కింది అంతస్తులలో దాదాపు యాబై మందిని పొట్టన పెట్టుకున్నారని అర్థం అయింది వాడి మాటల వల్ల.

వాడు ఫోన్లో నివేదిక ఇస్తున్నాడు. మిగతా అందరు ’అనుకున్న గమ్యాలకు’ చేరుకున్నారని, ’అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతున్నాయని’ చెబుతున్నాడు.

 

మా అందర్నీ ఎందుకు బందీలుగా పట్టుకున్నారో, మమ్మల్ని ఏమి చేయబోతున్నారో నాకు ఆ క్షణంలొ అర్థం కాలేదు కానీ త్వరగానే అర్థం అయింది.

మమ్మల్ని అందర్నీ చేతులు వెనక్కు పెట్టుకుని కూచోమని ఆఙ్జాపించారు.

ఆ తరువాత వారిలో ఒకడు వచ్చి బలమైన టేపులతో మా చేతులను కట్టేశాడు.

వాడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది.

గుబురు గడ్డం దట్టంగా పెరగడం వల్ల నాకు పోలిక చిక్కడం లేదు, కానీ బలంగా తెలుస్తోంది వాడిని ఎక్కడో చూశాను అని. వాడు నాతో బాగా దగ్గరగా తిరిగిన వాడే అని తెలుస్తోంది.

పోలిక చిక్కినట్టే చిక్కి తిరిగి మళ్ళీ గుర్తు రావడం లేదు.

వాడి నుదుటిపై గాయం, పిల్లి కళ్ళూ.. కోల మొహం. ఇవన్నీ ఏదో ఙ్జాపకాల్ని తట్టి లేపుతున్నాయి.

వాడు కూడా ఉండుండి నా వంక చూసి, నాతో చూపులు కలిసిన తక్షణం తల తిప్పేసుకుంటున్నాడు. వాడు ఒక్కొక్కరికి చేతులు బంధించి, నోటిపై టేపు వేసుకుంటూ వస్తున్నాడ్.

నా  వద్దకు కూడా వచ్చేశాడు.

ఆ! గుర్తొచ్చేసింది. వీడు నా చిన్నప్పటి క్లాస్మేట్.

"ఒరే!... జావేద్. నువ్వేంటి ఇలా...?" అని ప్రశ్నించబోయేటంతలో నా నోటిపై బలమైన టేప్ వేశేశాడు.

ఇలా అందర్నీ బంధించి వారిరువురూ తిరిగి తలుపు దగ్గర అప్రమత్తంగా నిలబడ్డారు.

జావేద్ నాకు సుష్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాడు. వాడు అప్పుడప్పుడూ నన్ను చూసి తత్తరపాటుతో తల తిప్పేసుకుంటున్నాడు.

వీడెందుకిలా మారిపోయాడు?

నా ఆలోచనలు గతంలోకి దారి తీశాయి.

*****

అది ఒక చిన్న ఊరు.

అప్పుడు నేను పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను. జావేద్ నా క్లాస్ మేట్ ఒకటో తరగతి నుంచి.

జావేద్ గూర్చి చెప్పబోయే ముందు సామవేదం మేష్టారు గూర్చి చెప్పుకోవాలి. నా స్కూలు తాలుకు ఙ్జాపకాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి  ఈ శ్రీ సామవేదం మేష్టారు. ఆయన అసలు పేరు షఫియుల్లా.

సామవేదం ఆయన కలం పేరు. ఆయన కవితలు, కథలు వ్రాసేవారు. ఆయన మాకు తెలుగు చెప్పిస్తుండేవారు. ఆయన మా స్కూలు హెడ్మాష్టరు కూడాను.

శ్రీ సామవేదం మాష్టార్ గారిపై గౌరవంతో చుట్టుప్రక్కల ఉన్న సుమారు ఇరవై గ్రామాల ప్రజలువారి పిల్లల్ని మా పాఠశాలలోనే చేర్పించేవారు.

ఆయనని కేవలం ఒక ఉపాధ్యాయుడు అనో, ఒక స్కూల్ హేడ్ మేష్టార్ అనో పరిచయం చేసి సరిపుచ్చడం ఆయన్ని, ఆయన వ్యక్తిత్వాన్నీ పూర్తిగా చూపకపోవటమే అవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక విశ్వ మానవుడు.

ఆయన కుల మత బేధాలకు అతీతంగా విద్యార్థులందర్నీ తన స్వంత పిల్లల్లా చూసుకునే వాడు.  తన పాఠ్యాంశలే కాక ఇతర సబ్జక్టులన్నింటినీ అందరికీ తన ఇంట్లో ఉచితంగా ట్యూషన్లు చెప్పేవాడు.

ఆయన్ని ఒక మతానికి చెందిన వ్యక్తిగా బావించలేము. ఆయన పుట్టుక రిత్యా ఒక మతంలో పుట్టినప్పటికీ మానవత్వమే నా మతం అన్నట్టు జీవించే వాడు. ఆయన అన్ని పండగలనీ ఆస్వాదించేవాడు. అందరితో ఆనందంగా గడిపేవాడు. ఈ దేహంలో  ఉఛ్వాస నిశ్వాసలు ఉన్నంత సేపు ప్రతి క్షణము పండగే అని అనే వారు.

మనం మరణించిన తర్వాత స్వర్గం నరకం అనేవి ఉన్నాయో లేవో వాటిని చూసిన వారెవరన్నా ఉన్నారో తెలియదు, కానీ ఈ రోజుని నీవు స్వర్గంగా మార్చుకుంటావా లేదా నరకంగా మార్చుకుంటావా అన్న నిర్ణయం తీసుకునే అవకాశం ప్రతి ఉషోదయం నీకు ఇస్తుంది అనేవారు.

తలవ్రాత, ఆలోచనా ధోరణి అన్న రెండు అంశాల గూర్చి ఆయన చెప్పిన మాటలు నా జీవితం పై చాలా ప్రభావం చూపాయి.

తలవ్రాత గురించి ఆయన ఏమంటాడు అంటే, నీవు ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అన్న అంశం వరకే నీ తలవ్రాత . ఆ తరువాత నీ యావత్తు జీవితం నీవు తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఉంటుంది.

నీ విజయాలకైనా నీ అపజయాలకైనా తలవ్రాతని నిందించవద్దు. నీ ఆలోచనలను మార్చుకో అని పదే పదే చెప్పేవారు. దేవుడు ఎక్కడో లేడు, నువ్వు తప్పు చేసినప్పుడల్లా నిన్ను అపరాధ భావనకి గురిచేసే నీలోని అంతరాత్మనే దేవుడు. నీ అంతరాత్మ మాట విను నువ్వు ఎప్పుడు తప్పుడు మార్గంలో వెళ్ళవు అని చెప్పేవారు.

ఈ మాటలని ఊరికే చెప్పటం కాదు ఆయన ఆచరించి చూపేవారు.

జీవితాన్ని ఆయన ఒక పసి పిల్లాడిలా ఆస్వాదించేవాడు.

మా చిన్న ఊర్లో మొదటి సారి ఒక పొలంలో బోర్ బావి వేసినప్పుడు ఈయన అక్కడే ఉండి పసి పిల్లాడిలా అక్కడే ఉండి ఆసక్తిగా తిలకించి ఆ కార్మికులందరికీ దగ్గరుండీ భోజనాలు పెట్టి, బోరు బావి లోంచి నీళ్ళు ఎగసి చిమ్మినప్పుడు పసిపిల్లాడిలా గంతులు వేశాడు.

ఆయనకు చినుకు కురిసినా ఆనందమే, మబ్బు పట్టి చల్లగాలి వీచినా ఆనందమే.

ఏండ కాచినా ఆనందమే, మెరుపు మెరిసినా ఆనందమే ఆయనకి.

శ్రీశ్రీ గారు తన శైశవగీతి ఈయనని చూసేవ్రాసారేమో అనిపిస్తుంది నాకైతే.

 

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-

కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ

ఏమీ ఎరుగని పూవుల్లారా,

అయిదారేడుల పాపల్లారా!

మెరుపు మెరిస్తే,

వాన కురిస్తే,

ఆకసమున హరివిల్లు విరిస్తే

అవి మీకే అని ఆనందించే

కూనల్లారా!

అచ్చటికిచ్చటి కనుకోకుండా

ఎచ్చటెచటికో ఎగురుతుపోయే

ఈలలు వేస్తూ ఎగురుతుపోయే

పిట్టల్లారా!

పిల్లల్లారా!

గరికిపచ్చ మైదానాల్లోనూ,

తామరపూవుల కోనేరులలో

పంటచేలలో, బొమ్మరిళ్లలో,

తండ్రి సందిటా, తల్లి కౌగిటా,

దేహధూళితో, కచభారంతో,

నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,

ఎక్కడ చూస్తే అక్కడ మీరై

విశ్వరూపమున విహరిస్తుండే

పరమాత్మలు

ఓ చిరుతల్లారా!

మీదే, మీదే సమస్తవిశ్వం!

మీరే లోకపు భాగ్యవిధాతలు!

 

వయసుతో నిమిత్తం లేదు, ఆయన మానసికంగా ఒక శిశువు అంతటి నిష్కల్మషుడు.

ఆయన దినచర్య చాలా పద్దతిగా ఉంటుంది. ఉదయం నాలుగున్నరకే లేచి అయిందిటికల్లా సిద్ధమయిపోయేవాడు.  చూస్తుండగానే పిల్లలందరూ వచ్చేస్తారు. వారితో యోగా చేయిస్తారు. ఆ తరువాత భగద్గీతలో శ్లోకాలు రాగయుక్తంగా ఆలపించి అర్థం వివరించే వారు.

రోజు అయిదుసార్లు నమాజు చేసేవారు. రంజాన్ పండగ నెల్లాళ్ళునియమబద్దంగా పండగ నియమాల్ని పాఠించేవారు.

ఇక ఊరికి ఊరి ప్రజలకు ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేపట్టే వారు. ఆయన పెట్టిన ఙ్జానభిక్షతో ఎదిగిన ఎందరో జీవితంలో అత్యుత్తమ స్థానాలలో స్థిరపడి ఉండేవారు. వారందరూ ఆయన అడగకనే ఆయన చేపట్టే సామాజిక కార్యక్రమాలలో ఆర్థికసాయం చేయటమే కాక చేదోడు వాదోడుగా ఉండేవారు.

ఆయనకి ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడ్ని కని ఆయన భార్య చిన్న వయసులోనే కన్ను మూసింది. ఆయన మళ్ళీ పెళ్ళీ అన్న మాట ఎత్తుకోకుండా తల్లీ తండ్రీ అన్నీ తానే అయి ఆ కుర్రాడ్ని పెంచుకుంటున్నాడు.

ఆ కుర్రాడే ఈ జావేద్.

అంత మంచి వ్యక్తికి ఈ కుర్రాడు ఎలా పుట్టాడా అని ఊరి వాళ్ళందరూ కూడా బాధపడేవారు.

మొదటి నుంచీ కూడా వాడిది విపరీత ధోరణే. చిన్న చిన్న విషయాలకే అందరితో తగువులాడటం, అందర్నీ నొప్పించడం చేసే వాడు.

అప్పట్లో నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు విశ్లేషించగలుగుతున్నాను, వాడు అప్పట్లో విపరీతమైన ఆత్మన్యూనతా భావముతో బాధపడేవాడు.

మా సామవేదం మాష్టారు వాడికి బుద్దిచెప్పి సన్మార్గంలో పెట్టాలని ఎంతో ప్రయత్నించాడు కానీ ఆయన ప్రయత్నాలు విఫలమే అయ్యేవి.

వాడు పదవతరగతి పరీక్షలు కూడా గట్టెక్కలేకపోయాడు. అది మొదలు చదువుకు స్వస్తి పలికాడు. చెడు స్నేహాలు, దురభ్యాసాలు, ఊర్లో ఎక్కడ గొడవలు ఉన్నా వాటిలో వాడి పాత్ర ఉండటాలు ఇవన్నీ మాములు విషయాలు అయిపోయాయి.

మనుషుల్ని నాలుగు రకాలుగా విభిజించవచ్చు అని చెప్పేవారు మామేష్టారు.

’అయాం ఓకే, యూ ఆర్ ఓకే ’అని నిరంతరం భావించే వాళ్ళు మొదటి రకం . కంపెనీ హెచ్చార్ మేనేజర్లు ఇలాంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకుని ఉద్యోగాలిస్తారట.

”అయాం ఓకే, యూ ఆర్ నాట్ ఓకే’ అని అనుకునే వారు రెండవ రకం. వీరు అహంభావం తో ఉంటారు. 

’అయాం నాట్ ఓకే, యూ ఆర్ ఓకే’ అని అనుకునే వారు మూడవ రకం. వీరు ఆత్మ న్యూనతతొ బాధ పడుతూ ఉంటారు.

’నేను బాగాలేను, నువ్వూ బాగాలేవు’ ఈ ప్రపంచమే చెడిపోయి ఉంది అని అనుకునే వారు నాలుగో రకం. ఇలాంటి వారు ఆత్మఘాతుక చర్యలకు, హింసాత్మక చర్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు.

ఏతావాతా మొదటి రకం వారికి మాత్రమే విజయావకాశాలు ఉంటాయని మాకు చిన్నప్పటి నుంచి బోధించే వారు మా మేష్టారు. మిగతా ముగ్గురికీ ఉద్యోగావకాశాలు తక్కువ ఉంటాయని, ముఖ్యంగా నాలుగో రకం కి చెందిన వారు ప్రపంచ శాంతికి హానికారకులవుతారని చెప్పేవాడు.

దీపం తన చుట్టూతా వెలుతురు పంచి ఇచ్చినా, తన క్రిందనే ఉన్న  చీకటిని పారద్రోలడంలో విఫలం అవుతుంది అన్నట్టు అయింది ఆయన పరిస్థితి.

ఆ తరువాత నేను పై చదువులకి ఊరు విడిచి వెళ్ళటం , ఉద్యోగ రిత్యా విదేశాలలో స్థిర పడటం ఇలా అనేక సంవత్సరాలు గడచిపోయాయి.

ఇటీవల నా పెళ్ళిపత్రిక ఇవ్వటానికి మా ఊరు వెళ్ళి మేష్టార్ని కలిశాను. ఆయన పడుకుని ఉన్నారు మంచం పై. అంపశయ్య మీద పడుకుని మృత్యువుకై ఎదురుచూస్తున్న భీష్మ పితామహుడిలా కనిపించారు ఆయన నాకు. నా పెళ్ళికి వస్తానన్నారు. అనటమే కాదు. వచ్చాడు కూడా.

అయినా ఆయనలో తేజస్సు, శక్తి యుక్తులు ప్రఙ్జా పాటవాలు ఏమాత్రం తగ్గలేదు. గ్రామానికి తనవంతు సేవలు చేస్తూనే ఉన్నాడు. పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉన్నారు.

కృంగి పోయి ఉన్నారు ఆయన. వయోభారం వల్ల కాదు. కొడుకు ఇల్లు వదలి వెళ్ళిపోయాడనే దుఃఖం అయన్ని నిలువెల్లా కృంగదీస్తోంది. ఆ కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏమి చేస్తున్నాడో తెలియదు. క్షేమంగా ఉన్నాడో లేదో తెలియదు. అతని ఆందోళన అంతా జావేద్ గూర్చే.

అదిగో అక్కడ అదృశ్యం అయిన ఆ జావేద్ ఇక్కడ ఇలా ప్రత్యక్షం అయ్యాడు.

ఇందాక చెప్పుకున్న నాలుగో తరహా వ్యక్తులను ఎన్నుకుని శిక్షణ ఇవ్వటమే పనిగా పెట్టుకుని శిక్షణ ఇవ్వటమే టెర్రరిస్ట్ సంస్థల పని హెచ్చార్ మేనేజర్ గా శిక్షణ పొందిన నాకు తెలుసు.

మొదటి తరహా వ్యక్తులను హెచ్చార్ మేనేజర్లు ఎన్నుకుంటే, నాలుగో తరహా వ్యక్తులను టెర్రరిస్టులు ఎన్నుకుంటారు. అదీ సంగతి.

*******

పెద్ద శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాను.

బయట నుంచి మైకులో పోలీసు వారి ప్రకటన వినిపిస్తోంది.

"నగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులను ఎక్కడికక్కడే మట్టుపెట్టాము. మీరు లొంగి పోండి, లేదా మిమ్మల్ని మా కమేండోలు హతమారుస్తారు"

అందుకు సమాధానంగా వీరి నాయకుడు కిటికీలోంచి మరో హేండ్ గ్రెనేడ్ విసిరాడు. అది హోటల్ ఆవరణలోని గోల్ఫ్ కోర్టులో పడింది. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.

తనదగ్గర ఉన్న హేండ్ మైక్ అందుకుని చెప్పాడు "మేము జిహాదీలం. మాకు ప్రాణ భయం లేదు. మాకు వందకోట్ల విలువైన బంగారు బిస్కట్లు, మంచి కండిషన్ లో ఉన్న లాంఛీ ఏర్పాటు చేయండి. అప్పుడు ఈ గదిలో ఉన్న బందీలను వదిలిపెడతాము. లేదా వారిని చంపి మేము చస్తాము."

ఈ చర్చలు సుమారు మూడు రోజులు సాగాయి.

ఈ మూడు రోజులు కూడా మూతికి టేపుతో, చేతుల్ని వెనక్కి విరిచి కట్టబడి, నడవటానికి కూడా వీలు లేకుండా గడిపాము.

నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాము.

ఇంత జరుగుతున్నా నాకు ఆ ఉగ్రవాదులపై కోపం రావడం లేదు. జాలి కలుగుతోంది. అవును నాకు జాలే కలిగింది.

నా ఆలోచనలు చరిత్రలోకి , విషయం తాలూకూ మూలాల్లోకి వెళుతున్నాయి.

విభజించు - పాలించు అన్న నియమాన్ని పాఠించి ఆంగ్లేయులు హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టారు . ఇప్పుడు అదే పద్దతిని అందిపుచ్చుకుని కొన్ని పాశ్చాత్య దేశాలు పాక్ - భారత్  మధ్య చిచ్చు పెట్టి, రెండు వర్గాలు నిరంతరం కొట్టుకుచచ్చేలా చేస్తూ, ఇరు వర్గాలకు ఆయుధాలు అమ్ముతూ , ఆ ఘర్షణ తాలుకు మంటల సెగలో చలి కాచుకుంటున్నాయి.

అందుకు గాను అక్కడా ఇక్కడా కూడా హింస కొనసాగిస్తూ , ఒకరిపై ఒకరికి అనుమానం కలిగేలాంటి పరిస్థితులను కల్పిస్తున్నాయి.

పొరుగు దేశం టెర్రరిస్టు దేశం అయితే మరక్కడ కూడా నిరంతరం ఎందుకు బాంబుదాడులు జరుగుతున్నాయి?

ఆయుధ విక్రేతలు ఆడిస్తున్న కుట్రలో భారత్, మరియు పొరుగు దేశాలు పావులవుతున్నాయి.

జావేద్ లాంటి యువకులు సమిధలవుతున్నారు.

ఎలా తెలుపను ఇదంతా జావేద్ కి?

చెప్పినా అర్థం చేసుకుంటాడా?

 

నాలుగో రోజు ఉదయం ఒక నాటకీయ పరిణామం జరిగింది.

బయట నుంచి పోలీసులు మైకులో ప్రకటించారు, వీరి కోరికలన్నింటినీ ఒప్పుకుంటున్నామని.

అనేక చర్చోపచర్చల అనంతరం మేమంతా మొదటిసారి బయటికి వచ్చాము. చీకట్లోనే ఉండటానికి ఇష్టపడే గుడ్లగూబల్లాగా ఉంది మా పరిస్థితి.  వెలుతురు చూడలేకపోయాము.

కొద్దిసేపు.

కదలటానికి సహకరించని కాళ్ళని ఈడ్చుకుంటూ , కదలటానికి వీల్లేకుండా కట్టేసిన చేతుల్లోని నొప్పిని సహిస్తూ మేమందరం బలికి తీసుకువెళుతున్న గొర్రెల్లా ఒక మందగా బయటికి వచ్చాము.

మాకు ముందర జావేద్. మా సమూహం వెనుకగా అప్రమత్తంగా ఒక అనుచరుడితో వాళ్ళ నాయకుడు.

ఇలా ముందుకు కదులుతూ గేట్ వే ఆఫ్ ఇండియా దాకా వచ్చాము.

దూరంగా చుట్టూ ఎటు చూసినా మిలటరీ వారు, మీడియా వారు . అక్కడంతా ఒక విధమైన ఉద్విగ్నమైన వాతావరణం నెలకొని ఉంది.

ఒక మిలటిరీ జవాను వచ్చి లాంఛి తాలూకు తాళాలు జావేద్ కి అందించాడు.

"లాంచిలో వంద కోట్ల విలువైన బంగారు బిస్కట్లు ఉన్నాయని. బందీలకు ఎవ్వరికీ హాని తలపెట్టవద్దని"  మైకులో ప్రకటన వస్తోంది.

ఇంక వంద అడుగులు వేస్తే మా బృందం లాంఛీ దగ్గరకి చేరుకుంటామనగా, టెర్రరిస్టు నాయకుడు చేతి మైకులో ప్రకటించాడు

"పోలీసులు , మిలటరీ అందరూ దూరంగా వెళ్ళిపోండి.మేము లాంచీ ఎక్కే చివరి క్షణం వరకు కూడా బందీలు మాతోనే ఉంటారు. మేము లాంచి ఎక్కి దూరం వెళ్ళే వరకు ఎవ్వరూ దగ్గరకు రాకూడదు" అని ప్రకటించాడు.

చేసేదేం లేక మిలటరీ వారు పోలీసు వారు వాహనాలతో సహా చాలా దూరం వెళ్ళి పోయారు. అప్పుడు నాకు కాస్తా భయం వేసింది. కవిత నాకు దగ్గరగా వచ్చి ఆనుకుంది. . నేను తనకు కళ్ళతోనే ధైర్యం చెప్పాను.

మా ముందర జావేద్ నడుస్తున్నాడు. నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ వాడు మాట్లాడటం ప్రారంభించాడు. అది కూడా నా ఒక్కడికే వినిపించేలాగా గొంతు తగ్గించి చెప్పడం మొదలెట్టాడు.

"నేను ఇప్పుడు ఒకటి చేయబోతున్నాను. దాని పరిణామం ఎలా ఉండబోతోందో నాకు తెలియదు.

సంతోష్ నన్ను క్షమించు.

నిన్ను చూడగానే నాకు నా బాల్యం, మన ఊరు, మా నాన్నగారు అన్నీ గుర్తు వచ్చాయి. నేను ఎంత పొరపాటు మార్గం ఎన్నుకున్నానో నాకు అర్థం అయింది. ఇక వెనక్కు తీసుకోలేనంత దూరం వచ్చేశాను. కానీ ఇప్పటికైనా ఒక మంచి పని చేసి చనిపోయానన్న తృప్తితో చస్తాను. అందుకే ఈ నిర్ణయం తిసుకున్నాను. నా సహచరులు, నేను సజీవంగా దొరికిపోయేలా ప్రయత్నం చేస్తాను. మా నాన్న గారికి నా నమస్కారాలు అందజేయి. నన్ను క్షమించమని అడుగు."

నేనింకా ఆశ్చర్యం నుంచి తేరుకోక మునుపే జావేద్ ఒక్క సారిగా తన సహచరులవైపు కి దూసుకుపోయాడు.

ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ వర్ణించాలి అంటే నాకు మాటలు చాలవు. నేను రచయితను అయి ఉంటే ఆ సంఘటనల్ని ఎంతో అద్భుతంగ చెబుదును ఒక సాధారణ హెచ్చార్ మేనేజర్ ని కాబట్టి ఏదో నాకు తెలిసిన విధంగా చెబుతాను.

చిరుతకన్నా వేగంగా కదిలి తన సహచరుల చేతులపై, మోకాళ్లపై కాల్పులు జరిపి వాళ్ళు ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపునే వాళ్ళని నిరాయుధుల్ని చేసీ తన అయుధాన్నీ దూరంగా విసిరేసి, రెండు చేతులూ పైకెత్తి మోకాళ్ళపై కూర్చుని మిలటరీ వారి వంక చూస్తూ కూర్చుండిపోయాడు.

ఈ విధంగా క్షణంలో వెయ్యవవంతులో తాము ముగ్గురు నిరాయుధులుగా, సజీవంగా మిలటరీ వారికి దొరికిపోయేలాంటి పరిస్థితులు కల్పించాడు.

మేమంతా స్వేఛ్ఛావాయువుల్ని పీల్చుకున్నాము.

కొన్ని నెలల విచారణానంతరం మిగతా ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష, జావేద్ కి యావజ్జీవిత ఖైదు విధింపబడింది.

***

తాను నెర్పిన పాఠాలు కాస్తా ఆలశ్యంగా అయినా పని చేశాయి అని గొణుక్కుంటున్నారు సామవేదం మేష్టారు గారు అశృనయనాలతో.

 

సమాప్తం.

 

(Published in Sanchika Web Magazine. Dt.12th September 2021 Sunday)